ఈ‑కామర్స్​లోనూ రిలయన్సే ముందు

ఈ‑కామర్స్​లోనూ రిలయన్సే ముందు

–న్యూఢిల్లీ: దేశపు ఈ–కామర్స్​ మార్కెట్లోనూ దూసుకెళ్లే అవకాశాలు ముకేశ్​ అంబానీ లీడర్షిప్​లోని రిలయన్స్​కే ఎక్కువగా ఉన్నాయని ఒక రిపోర్టు వెల్లడించింది. అతి పెద్ద రిటెయిల్​ స్టోర్​ నెట్​వర్క్​, టెలికం ఆపరేషన్స్, డిజిటల్​ మీడియా కార్యకలాపాలతో రిలయన్స్​కి ఈ–కామర్స్​లోనూ గట్టి పట్టు దొరికే ఛాన్స్​ ఉంటుందని ఆ రిపోర్టు పేర్కొంది. ఇండియా ఈ–కామర్స్​ మార్కెట్​ విలువ 150 బిలియన్​ డాలర్ల దాకా ఉండొచ్చని బెర్న్​స్టీన్ తాజా ​ రిపోర్టు లో పేర్కొంది. ఇండియాలోని ఈ–కామర్స్​ మార్కెట్లో మూడు కంపెనీలు ముందుకెళ్తున్నాయని, ఆ కంపెనీలు అమెజాన్​, వాల్​మార్ట్ (ఫ్లిప్‌‌కార్ట్‌‌), రిలయన్స్‌‌లని వివరించింది.  డిస్ట్రిబ్యూషన్​ ఛాలెంజెస్​ ఉండే ఇండియా మార్కెట్లో ముందడుగు వేయాలంటే ప్లానింగ్​ వేరుగా ఉండటం అవసరమని బెర్న్​స్టీన్ రీసెర్చ్​​ ఈ రిపోర్టులో వెల్లడించింది. ఆఫ్​లైన్​, ఆన్​లైన్​, ప్రైమ్​..ఇలా మూడు విభాగాలలోనూ పట్టు సాధిస్తేనే ఇండియా మార్కెట్లో సక్సెస్​ సాధ్యమవుతుందని పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్​ సిస్టమ్​ పటిష్టంగా ఉండటంతోపాటు, కస్టమర్లకు ఆన్​లైన్​ ప్లేయర్లతో  పోలిస్తే మెరుగైన ప్రైసింగ్​(మంచి రేట్లు) ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. 

దేశంలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ భారీ లెవెల్​లో డిజిటల్​ ఎకో సిస్టమ్​ను నిర్మిస్తోంది. ఈ గ్రూప్​లోని టెలికం కంపెనీ జియోకి 43 కోట్ల మంది మొబైల్​ సబ్​స్క్రయిబర్లున్నారు. మరోవైపు రిటెయిల్​ కంపెనీకి దేశంలో 18,300 రిటెయిల్​ స్టోర్లున్నాయి. ఈ కంపెనీ అమ్మకాలు 30 బిలియన్​ డాలర్లు. మొత్తంగా చూస్తే ఈ కంపెనీలో  డిజిటల్​ వాటా 17–18 శాతం (6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని బెర్న్​స్టీన్​ రీసెర్చ్​ రిపోర్టు తెలిపింది. ఇలా అన్ని విభాగాలలోనూ చొచ్చుకుపోతున్న రిలయన్స్​...అమెజాన్​, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్‌)​లకు దేశంలో గట్టిపోటీ ఇవ్వగలుగుతుందని రిపోర్టు పేర్కొంది. రిటెయిల్​ బిజినెస్​లో 4 లక్షల మందికి రిలయన్స్​ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే కొత్తగా 69 వేల మంది ఉద్యోగులు జాయినయ్యారు. దేశంలోని రిటెయిల్​ ఇండస్ట్రీతో పోలిస్తే రిలయన్స్​లో ఉద్యోగాలు మానేసే వాళ్ల శాతం తక్కువగానే ఉంటోందని కూడా బెర్న్​స్టీన్​ రిపోర్టు వెల్లడించింది. 

5 ఏళ్లలో రెట్టింపు కానున్న ఈ‑కామర్స్​ మార్కెట్​...

ఇండియా ఈ–కామర్స్​ మార్కెట్​ చాలా పెద్దది. ఈ మార్కెట్​ ఇంకా చొచ్చుకుపోవడానికి ఛాన్స్​లు ఎక్కువగా ఉన్నాయని రిపోర్టు వివరించింది. 2025 నాటికి 150 బిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఆన్​లైన్​ బిజినెస్​ రాబోయే  అయిదేళ్లలో రెట్టింపవుతుందని పేర్కొంది. 23 బిలియన్​ డాలర్ల గ్రాస్​ మెర్చండైజ్​ వాల్యూతో  ఫ్లిప్​కార్ట్ ​టాప్​ప్లేస్​లో ఉండగా, 18–20 బిలియన్​ డాలర్ల గ్రాస్ ​మర్చండైజ్​ వాల్యూతో అమెజాన్​ సెకండ్​ ప్లేస్​లో నిలుస్తోంది. ఈ రెండు కంపెనీలకు కలిపి మార్కెట్లో 60 శాతం వాటా ఉంది. 5.7 బిలియన్​ డాలర్ల ఈ–కామర్స్​ అమ్మకాలతో రిలయన్స్​ ఇప్పుడు మూడో ప్లేస్​లో నిలుస్తోంది. ఏజియో​తో ఫ్యాషన్​ కేటగిరీలో, జియో మార్ట్​తో ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో రిలయన్స్​ దూసుకెళ్తోంది. రిటెయిల్​ నెట్​వర్క్​, మొబైల్​ నెట్​వర్క్​, డిజిటల్​ ఎకో సిస్టమ్​లతో పాటు,  సొంత దేశం కావడంతో రెగ్యులేషన్స్​పరంగానూ దేశీయ ఈ–కామర్స్​లో సింహభాగం వాటా సాధించడానికి  రిలయన్స్​కే మెరుగయిన అవకాశాలున్నాయని బెర్న్​స్టీన్​ రీసెర్చ్​ ఈ రిపోర్టులో స్పష్టం చేసింది. 2016 లో 24 మిలియన్​లుగా ఉన్న ఎఫ్లుయెంట్​ హౌస్​హోల్డ్స్​ (ఏటా 15 వేల డాలర్లకు మించి ఆదాయం ) 2025 నాటికి 50 మిలియన్​లకు చేరనున్నారంది.

నెలకు 8 జీబీ డేటా కన్జంప్షన్​...

 ఇండియాలో 4 జీ డేటా రేట్లు చాలా తక్కువని, పర్​కాపిటా మొబైల్​ డేటా కన్జంప్షన్​లో నెలకు 8 జీబీతో ఇండియా టాప్​లో నిలుస్తోందని వివరించింది. దేశంలో 53 కోట్ల మందికి ఇంటర్​నెట్​ యాక్సెస్​ ఉందని, చైనా తర్వాత రెండో పెద్ద యూజర్​ బేస్​ ఉన్న డిజిటల్​ ఎకానమీ ఇండియానేనని కూడా బెర్న్​స్టీన్​ రీసెర్చ్​ రిపోర్టు పేర్కొంది. 2025 నాటికి దేశంలోని ఇంటర్​నెట్​ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 శాతం అంటే 33 కోట్ల మంది ఆన్​లైన్​ షాపర్లుగా మారతారని అంచనా వేసింది.