కాగజ్ నగర్ డివిజన్లోని అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి కుంటలు, సాసర్ పిట్ లు, సోలార్ నీటి గుంతలు వన్య ప్రాణుల దూప తీరుస్తున్నాయ్. కాగజ్నగర్, సిర్పూర్ టి , ఖర్జెల్లీ, పెంచికల్పేట్ , బెజ్జూర్ రేంజుల్లో సుమారు వందకు పైగా నీటి కుంటలు, సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఎండలు పెరుగుతుండడంతో నెల రోజులుగా వీటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.
ఎండల తీవ్రత, వన్యప్రాణుల సంచారాన్ని బట్టి వారంలో రెండుసార్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లను తీసుకువచ్చి పోస్తున్నారు. నీటి కొరత లేకుండా ప్రతీ రేంజ్ లో సోలార్ తో నడిచే మోటార్లు బిగించారు. ఈ వేసవిలో అడుగంటిన వాగులు, చీలికల్లో నీళ్లు లేక తండ్లాడే వన్య ప్రాణులకు ఈ నీటి కుంటలు, సాసర్ పిట్లు ఊరటనిస్తున్నాయి. ఇవి లేకపోతే జంతువులు నీళ్ల కోసం అడవి నుంచి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడుతుండేవని, ఇప్పుడా సమస్య లేదని రేంజ్ ఆఫీసర్లు రమాదేవి, పూర్ణ చందర్, సుధాకర్ తెలిపారు.
కాగజ్ నగర్, వెలుగు