నెల్లూరు జిల్లా: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయారు. వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య.. తనకు కరోనా సోకిన తర్వాత ఆనందయ్య ఔషధాన్ని తీసుకున్నారు. అనంతరం కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆనందయ్య ఔషధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియాలో కోటయ్య వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజులకు కోటయ్య ఆరోగ్యం క్షీణించగా, ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కోటయ్యకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జీజీహెచ్ కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ కోటయ్య చనిపోయారు.
కోటయ్య మృతిపట్ల నారాయణ సంతాపం
కోటయ్య మృతి పట్ల ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు సీపీఐ నేత నారాయణ. ఆనందయ్య మందుతో కోలుకున్నాని కోటయ్య చెప్పారని..అయితే కోటయ్యగారికి ఇతరత్రా ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యలు ఉన్నట్లు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు గతంలోనే తెలిపిన మాట అందరికి తెలిసిందేనన్నారు. అదే నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ దాదాపు 320 మందికి పైగ కారోనా బారిన పడి చనిపోయిన వాస్తవాన్ని కూడా విస్మరించ కూడదన్నారు. ఆనందయ్య అందించిన ఉచిత వైద్యంపై అవాస్తవాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని.. వారి రహస్య ఎజెండాపై నా నిరసన వ్యక్తం చేస్తున్నాను అన్నారు నారాయణ.