మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డ్ పోలీస్ ల్యాండ్ స్కామ్..10 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డ్ పోలీస్ ల్యాండ్ స్కామ్..10 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డ్​ పోలీస్​ ల్యాండ్​ స్కామ్​
  • గర్మిళ్ల శివారు 115/4 సర్వేనంబర్​లో 3 ఎకరాలు కబ్జా
  • ఫేక్​ డాక్యుమెంట్లతో రిజిస్ర్టేషన్లు, ఎల్​ఆర్​ఎస్​ ప్రొసీడింగ్స్​
  • ప్లాట్లు చేసి అమ్ముకున్నా పట్టించుకోని యంత్రాంగం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం గర్మిళ్ల శివారు గోపాల్​వాడలో అత్యంత ఖరీదైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ రిటైర్డ్​ కానిస్టేబుల్​ బోగస్​​ డాక్యుమెంట్లతో కొట్టేశాడు. ఆపై ప్లాట్లు చేసి గజాల లెక్కన అమ్ముకుంటూ కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాడు. అందులో ప్లాట్లు కొన్నవారు ఫేక్​ డాక్యుమెంట్లతో ఎల్​ఆర్ఎస్​కు అప్లై చేసుకోవడం, సంబంధిత అధికారులు కండ్లు మూసుకొని ప్రొసీడింగ్స్​ జారీ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. 

మరోవైపు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అడ్డుకునే నాథుడు లేడు. దీనిపై ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్​ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఫేక్​ డాక్యుమెంట్లతో కబ్జా.... 

రెవెన్యూ రికార్డుల ప్రకారం, గర్మిళ్ల శివారులోని 115 సర్వేనంబర్​లో మొత్తం 12.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1954-–55 ఖాస్రా పహాణీ నుంచి 1981–-82 వరకు సర్కారీ బంచరాయి భూమిగా నమోదైంది. 1982-–83 నుంచి 1986–-87 వరకు రికార్డులు లేవు. 1987–-88 నుంచి 1994–-95 వరకు 115 సర్వేనంబర్​లో 9.37 ఎకరాలు సర్కారీ బంచరాయి, 115/1 సర్వేనంబర్​లో 2 ఎకరాలు పెద్దల కొమురయ్య, 115/2లో మరో 2 ఎకరాలు ధర్ని భీమయ్య పేరిట లావుని పట్టాగా రికార్డయింది.1997-–98 నుంచి 2002–-03 వరకు115 సర్వేనంబర్​లో ఉన్న 9.37 ఎకరాల నుంచి 3 ఎకరాలు మల్లెపూల నారాయణ పేరిట 115/4 సర్వేనంబర్​ లావుని పట్టాగా రికార్డుల్లో ఉంది. నారాయణకు 3 ఎకరాలు ఎట్లా అసైన్డ్​ అయ్యిందో ఎలాంటి వివరాలు లేవు. అసైన్​మెంట్ రిజిస్టర్​లోనూ ఆయన పేరు లేదు. 2005–-06 నుంచి 2010-–11మధ్య 115/4 సర్వేనంబర్​లో నారాయణ పేరిట ఉన్న 3 ఎకరాలు జుట్టు గంగాధర్​ పేరు మీదకు మారింది. 

ఇల్లీగల్​ రిజిస్ర్టేషన్​... బోగస్​ పట్టా.... 

2004 జూన్​ 26న మల్లెపూల నారాయణ నుంచి మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్​ ఆఫీస్​లో డాక్యుమెంట్​ నంబర్​ 0303 ద్వారా 115/4 సర్వేనంబర్​లోని 3 ఎకరాల భూమి జుట్టు గంగాధర్​కు సంక్రమించింది. అసలు నారాయణకు అసైన్డ్​ భూమి ఎట్లా వచ్చిందో రెవెన్యూ ఆఫీసులో ఎలాంటి రికార్డులు లేవు. అయినప్పటికీ ఆయన పేరిట ఉన్న లావుని పట్టా భూమిని సబ్​ రిజిస్ర్టార్​ ఆఫీసులో గుడ్డిగా దాన పట్టా చేసేశారు. వాస్తవంగా వీరిద్దరికి ఎలాంటి బంధుత్వం లేకపోయినా మేమమాన వరుస కలిపి రిజిస్ర్టేషన్​ చేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి 2010లో పట్టా నంబర్​ ఏ/ల్యాండ్స్​/8010/2010 మంచిర్యాల తహసీల్దార్​ సర్టిఫికెట్​ జారీ చేశారు. కానీ ఇది ఇన్​కమ్​ సర్టిఫికెట్​ కోసం కేటాయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. 

మార్కెట్​ విలువ రూ.10 కోట్లకు పైమాటే.... 

జుట్టు గంగాధర్​ 115/4 సర్వేనంబర్​లోని 3 మూడు ఎకరాల భూమిలో ప్లాట్లు చేసి పలువురికి అమ్మేశాడు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్​ రేటు గజం రూ.10వేల నుంచి రూ.15వేలు పలుకుతోంది. ఈ లెక్కన సదరు భూమి విలువ రూ.10 కోట్లకు పైమాటే. ఫేక్​ డాక్యుమెంట్లతో 2014 నుంచి ఇప్పటివరకు మంచిర్యాల సబ్​ రిజిస్ర్టార్​ ఆఫీసులో 30కి పైగా రిజిస్ర్టేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 115 సర్వేనంబర్​లో జుట్టు గంగాధర్​కు ఎలాంటి భూకేటాయింపు జరగలేదని రెవెన్యూ రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. 

అక్రమ నిర్మాణాలకు అడ్డేది.. 

115/4 సర్వేనంబర్​లో ప్లాట్లు కొన్నవారు ఎల్​ఆర్​ఎస్​లో దరఖాస్తు చేసుకోగా పలువురికి ప్రొసీడింగ్స్​ కూడా జారీ అయినట్టు సమాచారం. వీరిలో కొంతమంది మున్సిపల్​ పర్మిషన్​ లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. 

ఇది గవర్నమెంట్​ ల్యాండ్​ అని అసలు విషయం తెలుసుకున్న మరికొందరు ఏనాటికైనా ఇబ్బందులు తప్పవనే భయంతో నిర్మాణాలు చేపట్టేందుకు జంకుతున్నారు. గతంలో పనిచేసిన రెవెన్యూ, రిజిస్ర్టేషన్​, మున్సిపల్​​ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయింది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్​గా ఉన్నట్టు సమాచారం.