
- ఎఫ్ఎంసీజీ, మొబైల్, టొబాకో, ఆల్కహాల్ బిజినెస్లలో పన్ను ఎగవేత
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, మొబైల్, టొబాకో, ఆల్కహాల్ బిజినెస్లలో పన్ను ఎగవేత వల్ల 2019–20లో ఖజానాకు రూ. 58,521 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. అయిదు కీలక రంగాలలోనే ఎగవేత ఎక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. ఎగవేత ఎక్కువగా ఉన్న అయిదు రంగాలలో ఆ ఏడాదిలో రూ. 2.60 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ఈ రిపోర్టులో ఫిక్కి తెలిపింది. విలువపరంగా చూస్తే, ఒక్క ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోనే 75 శాతం అక్రమ దందా జరిగిందని పేర్కొంది. ఈ అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 58,521 కోట్ల మేర పన్ను వసూలు కాకుండా పోయినట్లు వివరించింది. అక్రమ దందాలు దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని రిపోర్టులో ఫిక్కి పేర్కొంది. పన్ను ఎగవేత పరంగా చూస్తే, టొబాకో, ఆల్కహాల్ బిజినెస్ల వల్ల 49 శాతం శాతం పన్ను ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్లు ఈ రిపోర్టు గుర్తించింది. అంతేకాదని, ఇలాంటి అక్రమ దందాల వల్ల రావల్సిన ఉద్యోగాలు రాకుండా పోతాయని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీలో 7.94 లక్షల ఉద్యోగాలు, టొబాకో ఇండస్ట్రీలో 3.7 లక్షల ఉద్యోగాలు, ఎఫ్ఎంసీజీ హౌస్హోల్డ్ అండ్ పర్సనల్ గూడ్స్ ఇండస్ట్రీలో 2.98 లక్షల ఉద్యోగాలు, ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇండస్ట్రీలో 97 వేల ఉద్యోగాలు, మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో 35 వేల ఉద్యోగాలు ఇలా రాకుండా పోయినట్లు ఫిక్కి రిపోర్టు వివరించింది.
అయిదు రంగాలు..
అక్రమ దందాలతో అయిదు రంగాలలో ఎగవేత బాగా ఎక్కువగా ఉందని చెబుతూ, ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీలో రూ. 17,074 కోట్లు, ఆల్కహాలిక్ బెవరేజెస్ బిజినెస్లో రూ. 15,262 కోట్లు, టొబాకో ప్రొడక్టులలో రూ. 13,331 కోట్లు, ఎఫ్ఎంసీజీ హౌస్హోల్డ్ అండ్ పర్సనల్ గూడ్స్ బిజినెస్లో రూ. 9,995 కోట్లు, మొబైల్ ఫోన్ల ఇండస్ట్రీలో రూ. 2,859 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగిందని ఫిక్కి రిపోర్టు వివరించింది. ఈ పరిశ్రమలు లేదా వ్యాపారాలకు ఇతర రంగాలతో ఉన్న సంబంధాల వల్లే ఎగవేత అధికమవుతున్నట్లు పేర్కొంది. అక్రమ దందాల మార్కెట్ సైజు మొత్తం రూ. 2.60 లక్షల కోట్ల దాకా ఉన్నట్లు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఎఫ్ఎంసీజీ (హౌస్హోల్డ్ అండ్ పర్సనల్ గూడ్స్, ప్యాకేజ్డ్ఫుడ్స్) వాటానే రూ.1.97 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనావేసింది. రూ. 23,466 కోట్లతో ఆల్కహాలిక్ బెవరేజెస్, రూ. 22,930 కోట్లతో టొబాకో ప్రొడక్ట్స్, రూ. 15,884 కోట్లతో మొబైల్ ఫోన్ల బిజినెస్లు ఆ తర్వాత ప్లేస్లలో నిలుస్తున్నాయని వివరించింది. దేశీయంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ను బలోపేతం చేయాలంటే ఇలాంటి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడం అవసరమని ఫిక్కి రిపోర్టు అభిప్రాయపడింది. ఇందుకు ప్రభుత్వం, పరిశ్రమ రంగాలు, వినియోగదారులు, అంతర్జాతీయ సంస్థలు ..అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించింది.