- గత 5 రోజుల్లోనే టన్ను రేటు 10 శాతం పైకి
- బియ్యం దిగుమతులపై సుంకాన్ని బంగ్లాదేశ్ తగ్గించడమే కారణం
న్యూఢిల్లీ: దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. లోకల్ మార్కెట్తో పాటు, ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ మన రైస్కు డిమాండ్ పెరగడంతో గత ఐదు రోజుల్లోనే సాధారణ రైస్ (బాస్మతి కాని) రేటు 10 శాతం మేర పెరిగింది. బంగ్లాదేశ్ అనుకున్నదాని కంటే ముందే దేశం నుంచి భారీగా రైస్ను దిగుమతి చేసుకుంటుండడమే రేట్లు పెరగడానికి ప్రధాన కారణం. అంతేకాకుండా రైస్ ఎగుమతులపై ప్రభుత్వం బ్యాన్ పెడుతుందనే అంచనాలు మార్కెట్లో పెరగడంతో కూడా రైస్ ధరలు ఎక్కువవుతున్నాయి.
రైస్ దిగుమతులపై బంగ్లాదేశ్ దిగుమతి సుంకాన్ని, టారిఫ్లను 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. దీన్ని దేశంలోని రైస్ వ్యాపారులు ఎగుమతులకు అవకాశంగా చూస్తున్నారు. రైస్ను దిగుమతి చేసుకోవడానికి ఆ దేశ వ్యాపారులకు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో బంగ్లాదేశ్ గోధుమల దిగుమతి తగ్గింది. ఇండియా కూడా గోధుమల ఎగుమతులను బ్యాన్ చేయడం, వీటితో పాటు వరదల కారణంగా ఈ దేశంలో పంటల దిగుబడి తగ్గింది. దీంతో రైస్పై బంగ్లాదేశ్ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ‘గత ఐదు రోజుల్లోనే టన్ను రైస్ (బాస్మతి కాని) ధర గ్లోబల్ మార్కెట్లో రూ. 27,300 (350 డాలర్ల) నుంచి రూ. 28,080 (360 డాలర్ల) కి ఎగిసింది. బంగ్లాదేశ్ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించిన తర్వాతనే ఇలా రేటు పెరిగింది’ అని రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీ కృష్ణా రావు అన్నారు. బంగ్లాదేశ్లో గోధుమల రేటు పెరగడంతో పాటు, వీటి ఇంపోర్ట్స్ తగ్గడంతో గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగింది. దీంతో రైస్పై ఒత్తిడి పెరుగుతోందని కృష్ణా రావు అన్నారు.
బంగ్లాదేశ్కే ఎగుమతి ఎక్కువ..
2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి బంగ్లాదేశ్కు ఏకంగా 6.11 బిలియన్ డాలర్ల (రూ. 47,658 కోట్ల) విలువైన రైస్ ఎగుమతులు జరిగాయి. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 4.8 బిలియన్ డాలర్లు (రూ. 37,440 కోట్లు) గా ఉంది. సాధారణంగా సెప్టెంబర్– అక్టోబర్ టైమ్లో రైస్ను దిగుమతి చేసుకునే బంగ్లాదేశ్, ఈ ఏడాది జూన్ 22 నుంచే రైస్ దిగుమతులను స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా రైస్ను దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రైస్ రేటు సుమారు 20 శాతం పెరిగిందని తిరుపతి అగ్రిట్రేడ్ సీఈఓ సురాజ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఎఫెక్ట్తో ఇతర ప్రాంతాల్లో కూడా రైస్ రేట్లు 10 శాతం వరకు పెరిగాయని వివరించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువగా రైస్ను వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా సెకెండ్ ప్లేస్లో ఉంటుంది. మొదటి ప్లేస్లో చైనా ఉంది. గ్లోబల్గా జరిగే రైస్ ట్రేడ్లో మన దేశ వాటా 40 శాతంగా ఉంటుంది.