
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఆదేశాలు మే 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. గత జనవరిలో రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకానికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం– 2025గా కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది.
పథకంలోని అంశం
- మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద హాస్పిటల్లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులు అవుతారు.
- ఈ సేవలు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల వరకు పొందవచ్చు.
- ఈ నోటిఫికేషన్లో బాధితుల కోసం ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని హాస్పిటళ్లనూ ఈ పథకం కిందకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
- ఈ నోటిఫికేషన్ ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుణ్ని హాస్పిటల్కు తీసుకువచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో హాస్పిటల్కు పంపించాల్సి ఉంటుంది. అందుకోసం సదరు హాస్పిటల్ వారే రవాణా సౌకర్యాలు కల్పించాలి.
- హాస్పిటల్ నుంచి బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన హాస్పిటల్ అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో అప్లోడ్ చేసి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.