బ్రిస్బేన్: ఇండియా వరల్డ్ కప్ నెగ్గి చాలా కాలం అవుతోందని, ఈసారి కప్పు సాధించాలంటే జట్టుగా తాము చాలా విషయాల్లో సరైన విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉండి, లక్ష్యంపై గురిపెడితే అనుకున్న ఫలితం లభిస్తుందని చెప్పాడు. ‘వరల్డ్ కప్ గెలవాలన్న ఉద్దేశం, ఆలోచనతోనే బరిలో నిలిచాం. కానీ, గమ్యాన్ని చేరుకోవాలంటే చాలా పనులు చేయాలని మాకు తెలుసు. కాబట్టి మేం ఒక్కో అడుగు ముందుకు వేస్తాం. ఎదుర్కోబోయే ఒక్కో జట్టుపై ఫోకస్ పెడుతాం. అంతేతప్ప ఇప్పుడే సెమీస్ లేదా ఫైనల్స్గురించి ఆలోచించం’ అని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.
తొలి సారి వరల్డ్ కప్లో టీమ్ను నడిపిస్తున్న రోహిత్ ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ‘ఈ మధ్య ఇండియాలో మేం రెండు సిరీస్లు గెలిచాం. కానీ, ఆస్ట్రేలియాలో సవాల్ వేరేలా ఉంటుంది’ అని రోహిత్ అన్నాడు. ఆదివారం పాకిస్తాన్తో ఇండియా వరల్డ్ కప్ పోరును ఆరంభించనుంది. ఇది పెద్ద మ్యాచ్ అయినప్పటికీ తాము ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటామని, వ్యక్తిగతంగా ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెడతామన్నాడు. అదే తమకు కీలకం అవుతుందని అభిప్రాయపడ్డాడు.