శ్రీనగర్: ఇండియాలోకి అక్రమంగా ఆయుధాలను తరలించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ చర్యలను మన సైన్యం అడ్డుకుంది. జమ్మూకాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ కేరన్ సెక్టర్ వద్ద ఇండియాలోకి ఆయుధాలు పంపేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కిషన్ గంగ నదిలో నుంచి నాలుగు ఏకే–74 రైఫిళ్లు, ఎనిమిది మ్యాగ్జైన్స్ ఇతర మందుగుండు సామగ్రి పంపిస్తున్నట్లు మన ఆర్మీ గుర్తించింది. అలర్ట్గా ఉన్న మన సైన్యం.. వీటిని స్వాధీనం చేసుకుంది. వెంటనే సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన మన ఆర్మీ కిషన్ గంగా నదికి అవతలున్న పీవోకే వద్ద ముగ్గురు మిలిటెంట్లు ఒక ట్యూబుకు తాడు కట్టి ఆయుధాలు ఇండియాలోకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనతో పాకిస్తాన్ ఆలోచనలో ఏ మార్పు లేదని స్పష్టంగా తెలుస్తోందని లెఫ్టినెంట్ జనరల్ రాజు అన్నారు. మన సెక్యూరిటీ ఫోర్సెస్ నిరంతరం అలర్ట్గా ఉంటున్నాయని, ఫ్యూచర్లో కూడా వారి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పషం చేశారు. ‘కేరన్, తంగ్ధర్, జమ్మూ సెక్టార్లోని పంజాబ్లో కూడా ఆయుధాలను అక్రమంగా సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కాశ్మీర్లో నివసించే ప్రజలను టెర్రరిజంలో ఉండేలా చేయడమే వారి టార్గెట్. ఆయుధాలు రాకుండా ఆపడమే మా లక్ష్యం. ఇక్కడ నివసించే ప్రజలకు ఏ విధమైన నష్టం జరగకుండా ఆపాలంటే, ప్రజల సహకారం మాకు చాలా అవసరం’ అని కార్ప్స్ కమాండర్ చెప్పారు.
జమ్మూలో ఎన్కౌంటర్..
నలుగురు మిలిటెంట్లు హతం
జమ్మూకాశ్మీర్లో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. సౌత్ కాశ్మీర్ కుల్గాం జిల్లా చింగం ఏరియాలో, పుల్వామా జిల్లా దదూర ఏరియాలో మిలిటెంట్లు దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో మన సెక్యూరిటీ ఫోర్సెస్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. చింగం ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న మన సెక్యూరిటీపై మిలిటెంట్లు ముందుగా కాల్పులు జరిపారు. మన వాళ్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు చనిపోయారు. చనిపోయిన మిలిటెంట్లు జైష్–ఈ–మహమ్మద్ గ్రూప్ చెందిన కుల్గాంలోని జంగల్పొర దివ్సర్లో నివసించే తరీక్ అహ్మద్ మీర్, పంజాబ్ పాకిస్తాన్లో ఉండే పాకిస్తాన్ సిటిజన్, ఎ కేటగిరి మిలిటెంట్ సమీర్ భాయ్ అలియాస్ ఉస్మాన్గా గుర్తించామని, సంఘటనా స్థలంలో ఒక ఎమ్4 రైఫిల్, ఒక పిస్టల్ రికవర్ చేశామని ఆర్మీ ఆఫీసర్ చెప్పారు. పుల్వామా జిల్లా దదూర ఏరియాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని, రెండు ఏకే రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.