ఇందూరులో రౌడీ గ్యాంగులు.. బాధితులను బెదిరించి దోపిడీ

ఇందూరులో రౌడీ గ్యాంగులు.. బాధితులను బెదిరించి దోపిడీ
  • దర్జాగా ల్యాండ్​ సెటిల్​మెంట్లు 

  • గుండాల వెంట సినిమా తరహా ఉస్తాద్​లు  

  •  బాధితులను బెదిరించి దోపిడీ

  •  పట్టించుకోని పోలీసులు 

నిజామాబాద్, వెలుగు ; ఇందూరులో రౌడీ ముఠాల ఆగడాలు పెరుగిపోతున్నాయి. కొందరు దాదాగిరితో డబ్బు సంపాదించడాన్ని దందాగా చేసుకున్నారు. ల్యాండ్​ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో అదేస్థాయిలో  లిటిగేషన్లు తయారయ్యాయి. వీటి​ సెటిల్​మెంట్లలో దర్జాగా ఎంటరవుతున్న రౌడీలు లక్షలు ఎగరేసుకెళ్తున్నారు. కత్తులు, తల్వార్​లు, కండలు తిరిగిన ఉస్తాద్​లను మెయింటెన్​చేస్తూ  బెదిరింపులకు పాల్పడుతున్నారు. సెటిల్​మెంట్​లో ఆధిపత్యం కోసం రౌడీల మధ్య గ్యాంగ్​వార్​ హత్యలకు సైతం దారితీస్తోంది. 

ఒక్క డీల్​.. రూ.27 లక్షలు

నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న  భూములు ఎకరాకు రూ.4 కోట్లు పలుకుతున్నాయి. ఓ యజమాని రెండెకరాలను అమ్మడానికి కొనుగోలుదారుతో ఒప్పందం చేసుకొని బయానా రాసుకున్నాడు. రూ.కోటి ముట్టజెప్పి నాలుగు కిస్తీల్లో మిగతా సొమ్ము ఇచ్చాక రిజిస్ర్టేషన్​కు వెళ్లాలన్నది ఒప్పందం. అయితే, అగ్రిమెంట్​తర్వాత మరొకరు భూమి తనదని ప్రవేశించడంతో కొన్నవారిలో టెన్షన్​ మొదలైంది. సమస్య లేకుండా ఉంటేనే మిగితా డబ్బు ఇస్తానని కొనుగోలుదారు పట్టాదారుకు స్పష్టం చేశాడు. అగ్రిమెంట్​ ప్రకారం డబ్బులు ఇవ్వలేదని పట్టాదారు రేటు పెంచి మరొకరికి భూమి అమ్మాడు. ఈ వ్యవహారం సెటిల్​మెంట్​కోసం రౌడీల వద్దకు చేరింది. ఇందులో డీల్ కుదిర్చిన సదరు రౌడీలు తమ వాటాగా రూ.27 లక్షలు తీసుకున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో సెటిల్​మెంట్​ఏదైనా రౌడీల దగ్గరికే చేరుతోంది. 

60 ఏళ్లు దాటినా ఆగని దందా..

నగరానికి చెందిన ఒక మాజీ కార్పొరేటర్​పై 1990వ దశకంలో పోలీసు రికార్డులో ( ఎస్పీ ఆర్.పి.మీనా హయాంలో) రౌడీషీట్​ తెరిచారు. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు దాటింది. ఈయన దందా అంతా సెటిల్​మెంట్లు చేయడమే. చుట్టూ ఎప్పుడు బాడీ బిల్డర్లను పెట్టుకొని వచ్చినవారిని భయపెడుతుంటాడు. నగరంలోని గాంధీ చౌక్​ సమీపంలో ఉండే ఈయన నాలుగంతస్తుల ఇంట్లో గ్రౌండ్​ ఫ్లోర్ మొత్తం పంచాయితీలకే  కేటాయించాడు. ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు తమ రూ.50 లక్షల పంచాయితీ తేల్చమని వస్తే వారి నుంచి 25 శాతం తీసుకొని డీల్​సెటిల్​చేశాడు. సమస్య పరిష్కరించమని వచ్చిన ఒకరి ఇంటికి తన గ్యాంగ్ సభ్యుడిని పంపి తాళం వేయించాడు. తర్వాత కత్తులతో చంపుతానని బెదిరించగా ఇల్లు కుదువ పెట్టి వారంలో డబ్బు చెల్లించాడు.  ల్యాండ్​ సెటిల్​మెంట్లు, బాకీ వసూళ్లకు తన వద్దకు రావొచ్చని బహిరంగంగా ప్రచారం చేసుకునే ఇతడి గురించి  పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

లిటిగేషన్​ సృష్టించి...

ఈ మధ్య ఒక డాక్టర్ ​కొన్న ప్రాపర్టీకి  నగరానికి చెందిన ఓ రౌడీ బోగస్​ రిజిస్ర్టేషన్ ​పేపర్లు సృష్టించి సెటిల్​మెంట్​కు ఇన్​వైట్​ చేశాడు. కాదు కుదరదు అంటే నడవదని, నిర్మాణ పనులు స్టార్ట్​ చేస్తామని హెచ్చరించడంతో సదరు డాక్టర్ బయటకు చెప్పకుండా రూ.25 లక్షలు ముట్టజెప్పాడు. భూతగాదాలు తెలుసుకునేందుకు, విలువైన ల్యాండ్​కొంటున్న వారి సమాచారం కోసం రిజిస్ట్రేషన్​ఆఫీస్​లో ఇద్దరిని ఇన్​ఫార్మర్లుగా పెట్టుకున్నట్లు 
సమాచారం.

  రిజిస్ట్రేషన్​ సిబ్బందిని బెదిరించి..

హమాల్​వాడీ ఏరియాలో జరిగిన ఒక ఇంటి స్థలం రిజిస్ర్టేషన్​ విషయంలో తనకూ వాటా కావాలని రెంజల్ మండలానికి చెందిన ఓ రౌడీ షీటర్ ​ఏకంగా రిజిస్ర్టేషన్​ సిబ్బందిని బెదిరించాడు. స్థిరాస్తి సొంతం చేసుకున్న వ్యక్తి నుంచి డబ్బు ఇప్పించాలని బెదిరించడంతో వారు తలొగ్గినట్లు సమాచారం. 

ముగ్గురి పేర్లు ప్రముఖం..

జిల్లాలో లిటిగేషన్​ భూములు కొనే విషయంలో ముగ్గురి పేర్లు విస్తృత ప్రచారం పొందాయి. ఏజెంట్లను నియమించుకొని జిల్లా వ్యాప్తంగా దందా నడుపుతున్నారు. నిత్యం  లగ్జరీ కార్లలో తిరుగుతూ ల్యాండ్​మాఫియా నడుపుతున్నారు. వారి దందాలో పోలీసులకు షేర్​ఇస్తారనే ఆరోపణలు
 వినిపిస్తున్నాయి.

గ్యాంగ్​వార్..​

రౌడీల మధ్య ఆధిపత్య పోరు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. దందాలో పట్టు సాధించడానికి ఎంతవరకైనా వెళ్తున్నారు.  ఈ మధ్య నందిపేటలో సుపారీ హత్య మొదలుకొని గత 5 నెలల్లో ముగ్గురు రౌడీల మర్డర్లకు గ్యాంగ్​వారే​ ప్రధాన కారణం. మెట్రో నగరాల సుపారీ హత్యల సంస్కృతి జిల్లాను తాకడం ఆందోళన కలిగిస్తోంది.