హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు వ్యవహారంపై ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల తగ్గింపు తమ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ‘ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపే చాన్స్ ఉంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోర్టును ఆశ్రయించడం లేదు. సీఎం జగన్ను కలసి మా పరిస్థితిని తెలియజేసి.. సరైన పరిష్కారం కోరుతాం’’ అని దానయ్య ట్వీట్ చేశారు.
It is true that the slashing of ticket prices will affect our film immensely. But we at #RRRMovie have no intention of going to court. We are trying to approach the honourable Andhra Pradesh CM garu and explain our situation for an amicable solution.
— DVV Entertainment (@DVVMovies) November 14, 2021
ఇకపోతే, టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా టిక్కెట్ రేట్ల విషయంపై చర్చలు నడుస్తున్నాయి. టిక్కెట్ ధరలను పెంచమంటూ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను కోరుతున్నారు. రాబోయే రెండు నెలల్లో టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఉంది. అయితే ఇప్పట్లో ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం తేలేలా కన్పించడం లేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఈ విషయంపై కోర్టుకు వెళ్తోందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ఆ మూవీ ప్రొడ్యూసర్ దానయ్య క్లారిటీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం జగన్ను కలుస్తామని చెప్పారు.