బాలానగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ఈద్గాన్ పల్లి గ్రామంలో రూ.46 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) మంజూరైందని చెప్పారు.
ఆదివారం మండలంలోని ఈద్గాన్ పల్లిలో ఇందిరమ్మ ఇంటితో పాటు రూ.26 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. గ్రామానికి 15 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, వచ్చే ఏడాది మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్ల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 సబ్ స్టేషన్లతో పాటు ఒక 132 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేసినట్లు చెప్పారు.
ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి లైన్ క్లియర్
జడ్చర్ల టౌన్: ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంచేందుకు సీఎం, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంగీకరించారని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. ఆదివారం జడ్చర్లలో ప్రెస్క్లబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
భూనిర్వాసితులకు రూ.146 కోట్లు అదనంగా పెంచేందుకు లైన్ క్లియర్ అయిందని, ఈ ఫైల్ కు లీగల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. వచ్చే నెల9 లోపు ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. 8 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందకు తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు న్యాయం చేసేందుకు తనవంతు కృషి చేశానని తెలిపారు.
