- మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి కోరారు. మహబూబ్నగర్ ప్రధాన స్టేడియంలో సీఎం టార్చ్ ర్యాలీని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరై టార్చ్ను వెలిగించారు. అనంతరం కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్టేడియం నుంచి డైట్ కళాశాల వరకు స్టూడెంట్లు, క్రీడాకారులు, ఎన్సీసీ క్యాడేట్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించడమేనని అన్నారు. కాగా.. పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై విద్యార్థులు, క్రీడాకారులకు ఎస్పీ అవగాహన కల్పించారు.
అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ సీఎం కప్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహ రెడ్డి, జడ్పీ సీఈవో వెంకట రెడ్డి, జిల్లా క్రీడలు, డీవైఎస్వో శ్రీనివాస్, డీఎంహెచ్వో కృష్ణ, డీపీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
