
- క్యూలో స్పుత్నిక్
- రష్యా కరోనా వ్యాక్సిన్కు వారంలో పర్మిషన్?
న్యూఢిల్లీ: తమ దేశం కరోనా ట్రీట్మెంట్ కోసం డెవెలప్ చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి మోడీ ప్రభుత్వం నుంచి 7–10 రోజుల్లో తుది అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండియాలో రష్యన్ డిప్యూటీ ఎన్వాయ్ రోమన్ బబుష్కిన్ వెల్లడించారు. ఇందుకోసం ఇండియాకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, తమ వ్యాక్సిన్ ధర చాలా తక్కువ ఉంటుందని చెప్పారు. స్పుత్నిక్ను మైనస్ 2 డిగ్రీల నుంచి మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్తో నిల్వ చేయాలని రోమన్ వివరించారు. ‘‘ఇండియా–రష్యా గ్లోబల్ స్ట్రాటెజిక్ పార్టనర్షిప్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ కీలకం. మా వ్యాక్సిన్ ఎఫికసీ 91.6 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ లాన్సెట్ ఇది వరకే ప్రకటించింది. ఇది వరకే దీనిని 60 దేశాల్లో రిజిస్టర్ చేశారు’’ అని పేర్కొన్నారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ను రష్యా బయట అత్యధికంగా తయారు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. మనదేశానికి 85 కోట్ల డోసులు అందించడానికి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) పలు ఇండియన్ ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
మొదట రష్యా నుంచి.. తరువాత ఇండియాలో తయారీ
ఇండియాలో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి ఆర్డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహా పలు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక వ్యాక్సిన్లను మొదట రష్యా నుంచి దిగుమతి చేస్తారని తెలిసింది. మరికొన్ని రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చే అవకాశాలు ఉండటంతో, వ్యాక్సిన్ ధరపై కేంద్రం చర్చలు ప్రారంభించింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం సీరమ్ నుంచి కోవాగ్జిన్ డోసుకు రూ.150 చొప్పున చెల్లిస్తోంది. ఇండియాలో తాము కోటి డోసులు తయారు చేస్తామని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. దీంతోపాటు హెటెరో, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ ఫార్మా, విక్రో బయోటెక్లు కూడా వ్యాక్సిన్ తయారీ కోసం ఆర్డీఐఎఫ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ‘‘అవసరాన్ని బట్టి మొదట డాక్టర్ రెడ్డీస్ రష్యా నుంచి నేరుగా వ్యాక్సిన్లను కొని ఇండియాలో సప్లై చేస్తుంది. తరువాత అన్ని కంపెనీలూ మనదేశంలోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ను తయారు చేస్తాయి. లోకల్గా తయారీ మొదలుకాగానే వ్యాక్సిన్ ధర తగ్గుతుంది. అన్ని కంపెనీలూ తయారీ మొదలుపెడతాయి కాబట్టి భారీగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి’’ అని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు. ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 21 రోజుల తరువాత రెండోది ఇస్తారు. 28 నుంచి 42 రోజుల మధ్య ఇమ్యూనిటీ భారీగా పెరుగుతుందని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు. వ్యాక్సిన్పై ఇది వరకు తాము నిర్వహించిన ట్రయల్స్ డేటాను గవర్నమెంట్కు ఇచ్చామని చెప్పారు.
బ్రిడ్జింగ్ ట్రయల్స్ తప్పనిసరి...
లోకల్ కంపెనీలు విదేశాల వ్యాక్సిన్లను తయారు చేయడానికి ముందు బ్రిడ్జింగ్ ట్రయల్స్ చేయాలి. వ్యాక్సిన్ను కొత్తగా ఒక దేశంలోకి తీసుకొచ్చేందుకు క్లినికల్ డేటా ఆధారంగా చేసే ప్రయోగాలను బ్రిడ్జింగ్ ట్రయల్స్ అంటారు. బ్రిడ్జింగ్ ట్రయల్స్కు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కామన్ ట్రయల్స్కు అనుమతులు ఇవ్వాలని ఫార్మా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ మాత్రమే బ్రిడ్జింగ్ ట్రయల్స్ నిర్వహించింది. దాదాపు 1,500 మందికి వ్యాక్సిన్ ఇచ్చి, సేఫ్టీ, ఇమ్యునోజెనిసిటీ వంటి వాటిని టెస్ట్ చేసింది. ప్రపంచంలో తొలిసారిగా రిజస్టర్ అయిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్. రష్యా రాజధాని మాస్కోలోని గమలెయా నేషనల్ రీసెర్చ్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయోలజీ, ఆర్డీఐఎఫ్ సహకారంతో దీనిని డెవెలప్ చేసింది.