ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి..యుద్దం మొదలయ్యాక అతిపెద్ద దాడుల్లో ఒకటి

ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి..యుద్దం మొదలయ్యాక అతిపెద్ద దాడుల్లో ఒకటి

ఉక్రెయిన్పై మరోసారి భారీ ఎత్తున దాడులకు దిగింది. శుక్రవారం(జూన్ 6) భారీ డ్రోన్లు, క్షిపణులతో దాడి విరుచుకుపడింది. ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అతిపెద్ద దాడులలో ఒకటి. 

ఉక్రెయిన్పై రష్యాసుమారు 407 షాహెడ్ డ్రోన్లు ,క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో సహా 45 క్షిపణులను ప్రయోగించింది. కీవ్, ల్వివ్, టెర్నోపిల్, చెర్నిహివ్, క్రేమెంచుక్ నగరాలతో పాటు కీవ్, వోలిన్, సుమీ, పోల్టావా, ఖ్మెల్నిట్స్కీ, చెర్కాసి ప్రాంతాలలో పౌరుల నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నివాస భవనాలు, ఇంధన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

శుక్రవారం రష్యా జరిపిన దాడుల్లో ఆరుగురు మృతిచెందారు. 80 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు ఎమర్జెన్సీ సేవల సిబ్బంది కూడా ఉన్నారు.

రష్యా దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యా దాడులను చాలా వరకు అడ్డుకున్నామని ప్రకటించింది. ఉక్రెయిన్ వైమానిక దళం 199 డ్రోన్లను ,30 క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపింది.ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) వ్యవస్థల ద్వారా 169 డ్రోన్లను స్మాష్ చేశామని తెలిపింది. 

శుక్రవారం ఉక్రెయిన్ పై జరిపిన దాడులపై రష్యా అధికారికంగా స్పందించింది. ఈ దాడులను ఉక్రెయిన్ రష్యాపై చేసిన ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  

ఉక్రెయిన్ పై ఈ దాడులు రష్యాలోని వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిన కొన్ని రోజుల తర్వాత జరిగాయి. ఇందులో రష్యాకు చెందిన పలు వ్యూహాత్మక బాంబర్ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ తెలిపింది. తాజా పరిణామాలన్నీ ఇరు దేశాలమధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.