న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల వలన ఈ ఏడాది సెప్టెంబర్లో రష్యా నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు కిందటేడాది సెప్టెంబర్తో పోలిస్తే 29శాతం పడిపోయాయి. కిందటేడాది సెప్టెంబర్లో 4.675 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇవి, ఈ ఏడాది సెప్టెంబర్లో 3.322 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇండియా మొత్తం క్రూడాయిల్ దిగుమతులు కూడా ఏడాది లెక్కన 6.66శాతం దిగొచ్చాయి.
ఇరాక్ నుంచి కూడా 16శాతం తగ్గుదల కనిపించింది. అయితే, భారత్ రష్యా స్థానాన్ని భర్తీ చేయడానికి ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ, యూఎస్, అంగోలా, కొలంబియా నుంచి కొనుగోళ్లు పెరిగాయి. నైజీరియా, తుర్కియే, లిబియా, ఈజిప్ట్ వంటి కొత్త దేశాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ఇండియా మొత్తం ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా కిందటేడాది సెప్టెంబర్లో 40.74శాతం ఉంటే, ఈ ఏడాది సెప్టెంబర్లో 31.02 శాతానికి పడింది.
గల్ఫ్ దేశాల (సౌదీ, యూఏఈ, కువైట్ కలిపి) వాటా 26.6శాతం నుంచి 31.3శాతానికి పెరిగింది. కెనడా నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే, ఈ డైవర్సిఫికేషన్తో ఖర్చు ఎక్కువవుతోంది. టన్ను రష్యన్ ఆయిల్ 500 డాలర్లకు లభించగా, యూఏఈ (543 డాలర్లు), సౌదీ (560డాలర్లు), అమెరికా(549 డాలర్లు), లిబియా (602 డాలర్లు) నుంచి వచ్చే ఆయిల్ ధరలు దీని కంటే ఎక్కువగా ఉన్నాయి. దిగుమతులు తగ్గినా, ఆయిల్ ధరలు పెరగడం వల్ల రిఫైనరీ మార్జిన్లు, ట్రేడ్ డెఫిసిట్, ఇంధన ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
