అనాథ వృద్ధుల ఆశ తీర్చిన సజ్జనార్

అనాథ వృద్ధుల ఆశ తీర్చిన సజ్జనార్
  • భద్రాచలం చూడడానికి సొంతంగా బస్సు ఏర్పాటు 
  • శ్రీకాకుళం నుంచి తరలివచ్చిన 20 మంది మహిళలు 

భద్రాచలం, వెలుగు : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఆంధ్రప్రదేశ్​లోని అనాథ వృద్ధులు భద్రాచలం రావడానికి సొంత ఖర్చులతో బస్సు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలసలో సాలూరు సిద్ధార్ధ అనే యువకుడు 20 మంది అనాథ వృద్ధులకు ఆశ్రయం ఇచ్చాడు. వారు తమకు భద్రాద్రి రాముడిని చూడాలని ఉందని సిద్ధార్ధకు చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‍కు ఫోన్​ చేసి చెప్పాడు. దీంతో స్పందించిన సజ్జనార్​ సొంత ఖర్చుతో ఒక బస్సు ఏర్పాటు చేశారు. దీంతో వారు గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని, పర్ణశాల రామయ్యను దర్శించుకున్నారు. దర్శనంతో పాటు  వసతి, భోజనం అన్నీ ఖర్చులూ సజ్జనారే భరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీకి వారు థాంక్స్​చెప్పారు.