ముంబై: కంపెనీలు తమ ఎంప్లాయిస్కు పెద్ద ఎత్తున జీతాలు పెంచాలని భావిస్తున్నాయి. వచ్చే ఏడాది సగటున 9.3 శాతం పెంపు ఉంటుందని తెలుస్తోంది. ఈ సంవత్సరంలో ఇది 8 శాతం నుండి మొదలయింది. ఉద్యోగులు ఇతర కంపెనీలకు వెళ్లకుండా నిలుపుకోవడానికి, కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి భారీగా ఇంక్రిమెంట్లు ఇస్తున్నారని గ్లోబల్ అడ్వైజరీ, బ్రోకింగ్ సొల్యూషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ స్టడీ వెల్లడించింది. 'శాలరీ బడ్జెట్ ప్లానింగ్’ పేరుతో ఇది తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం... కరోనా ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోవడంతో రాబోయే 12 నెలల్లో అన్ని సెక్టార్ల బిజినెస్లు పెరుగుతాయి. వచ్చే ఏడాదికి ఆసియా-–పసిఫిక్ దేశాలన్నింటి కంటే ఇండియాలోనే జీతాల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మే–జూన్ మధ్య కంపెనీల నుంచి సేకరించిన అభిప్రాయాలతో శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్ ను తయారు చేశామని వాట్సన్ తెలిపింది. ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని 435 కంపెనీలతో సహా ఆసియా–-పసిఫిక్ దేశాలకు చెందిన పలు సెక్టార్లలోని 1,405 కంపెనీలు పాల్గొన్నాయి.
భవిష్యత్పై గంపెడు ఆశలు
మనదేశంలోని 52.2 శాతం కంపెనీలు రాబోయే 12 నెలల్లో వ్యాపార ఆదాయం బాగానే పెరుగుతుందనే అంచనాలతో ఉన్నాయి. రాబోయే 12 నెలల్లో భారీగా జాబ్స్ ఇవ్వడానికి 30 శాతం కంపెనీలు రెడీ అవుతున్నాయి. కిందటి ఏడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ నుంచి 57.5 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి 53.4 శాతం, టెక్నికల్ స్కిల్స్ అవసరమయ్యే కంపెనీల నుంచి 34.2 శాతం, సేల్స్ రంగం నుంచి 37 శాతం జాబ్స్ వస్తాయని అంచనా. ఫైనాన్స్ సెక్టార్ 11.6 శాతం జాబ్స్ ఇవ్వొచ్చని వాట్సన్ రిపోర్టు అంచనా వేసింది. ఈ రంగాల్లోనే జాబ్స్కు ఎక్కువ జీతం చెల్లించాల్సి ఉంటుంది.మిగతా దేశాలతో పోలిస్తే జాబ్స్ మానేయడం (అట్రిషన్ రేట్) మనదేశంలో తక్కువగా ఉంది. వాలంటరీ అట్రిషన్ రేటు 8.9 శాతం కాగా, ఇన్వాలంటరీ అట్రిషన్ రేటు 3.3 శాతంగా ఉంది. "బిజినెస్లు బాగుంటాయనే నమ్మకం వల్ల ఇంక్రిమెంట్లకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. మరింత మంది ఎంప్లాయిస్ను తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి’’ అని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సల్టింగ్ లీడర్ ఇండియా, టాలెంట్ అండ్ రివార్డ్స్, రాజుల్ మాథుర్ చెప్పారు. సత్తా గల ఎంప్లాయిస్ను ఆకర్షించడం, నిలుపుకోవడం కంపెనీలకు సవాలుగా మారిందని, అందుకే ఇంక్రిమెంట్లతోపాటు అదనపు ప్రయోజనాలనూ అందిస్తున్నారని వివరించారు. దీనివల్ల జనం కూడా మరింత ఖర్చు చేస్తారని అన్నారు.
టెక్ సెక్టార్లోనే ఎక్కువ జీతాలు
టెక్ సెక్టార్లో జీతాలు వచ్చే ఏడాది అత్యధికంగా 9.9 శాతం పెరుగుతాయని అంచనా. రిటైల్ రంగంలో 9.5 శాతం, తయారీ రంగంలో 9.30 శాతం పెంపు ఉంటుందని సంబంధిత కంపెనీలు తెలిపాయి. కిందటి సంవత్సరంతో పోల్చితే, టెక్ సెక్టార్ జీతాలను అదనంగా1.9 శాతం వరకు పెంచనుంది. "కరోనా వల్ల టెక్ సెక్టార్లో ఆటోమేషన్, ఏఐ, డిజిటలైజేషన్ ఊపందుకుంది. దీనివల్ల హైటెక్ సెక్టార్ రిమోట్ వర్కింగ్ మోడల్ను అందరికంటే ముందు అమలు చేసింది. జీతాలనూ బాగా పెంచుతోంది. కొవిడ్ రిస్ట్రిక్షన్లను తొలగించడం వల్ల మాన్యుఫాక్చరింగ్, రిటైల్ రంగాలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. కస్టమర్ సెంటిమెంట్ బాగుంది. ఈ సెక్టార్లకు డిమాండ్ మరింత పెరిగింది’’ అని రాజుల్ వివరించారు. అయితే ఎనర్జీ సెక్టార్లో ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా జీతాలు తక్కువగానే పెరుగుతాయని భావిస్తున్నారు. ఎనర్జీ సెక్టార్ కంపెనీల్లో జీతాల సగటు పెరుగుదల 7.7 శాతం మాత్రమే ఉంది. 2022 లో ఇది 7.9 శాతం కంటే తక్కువే ఉండొచ్చు.