ప్రపంచమంతా ఇదే పరిస్థితి
అన్ని కంపెనీల సేల్స్ తగ్గుదల
న్యూఢిల్లీ: ఆ దేశం.. ఈ దేశం అని కాదు. అన్ని దేశాల్లోనూ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్దస్మార్ట్ ఫోన్ మార్కెట్లు చైనా, ఇండియాలలో ఫోన్ల సేల్స్ పడిపోతున్నాయి. అన్ని కంపెనీల్లోనూ అమ్మకాల తగ్గుదల కనిపిస్తోందని తాజాగా టెక్నాలజీ రీసెర్చ్ కంపెనీ గార్నర్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత సంవత్సరం రెండో క్వార్టర్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 20.4 శాతం తగ్గాయి. అయితే అమ్మకాలపరంగా మొదటి స్థానంలో శామ్సంగ్ నిలిచింది. తదుపరిస్థానాల్లో హువావే, ఆపిల్, షావోమీ, ఒప్పోలు ఉన్నాయి. గత ఇదేకాలంలో ఆపిల్ అమ్మకాలు 0.4 శాతం తగ్గి 4.8 కోట్ల యూనిట్లకు పడిపోయాయి. హువావే అమ్మకాలు 27.1 శాతం, శామ్సంగ్ అమ్మకాలు 6.4 శాతం తగ్గాయి. ఈ రెండు కంపెనీలు దాదాపు 5.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్మాయి. షావోమీ అమ్మకాలు 26 శాతం, ఒప్పో సేల్స్ 23 శాతం పడిపోయాయి. షావోమీ 2.6 కోట్లు, ఒప్పో 2.3 కోట్ల యూనిట్లను అమ్మగలిగాయి.
చైనాలో అమ్మకాలు ఏడు శాతం, ఇండియాలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 46 శాతం తగ్గాయి. అయితే చైనాలో పరిస్థితులు చక్కబడుతున్నకొద్దీ డిమాండ్ రికవరీ అవుతున్నదని గార్నర్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్షుల్ గుప్తా చెప్పారు. ప్రయాణాలపై రెస్ట్రిక్షన్లు పెట్టడం, అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లు తగ్గడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ పడిపోయాయని వివరించారు. ఇదిలా ఉంటే, చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హువావే ఇప్పటికీ మార్కెట్ లీడర్. దీనికి అక్కడ 42 శాతం వరకు మార్కెట్ షేర్ ఉంది. అందుకే శామ్సంగ్ స్థాయిలో ఇది ఫోన్లను అమ్మగలిగింది. అయితే అమెరికా ప్రభుత్వం రిస్ట్రిక్షన్ల వల్ల హువావే బిజినెస్ దెబ్బతింది. గూగుల్ సేవలను వాడొద్దని ఆదేశాలు ఉండటంతో, హువావే ఫోన్లను గూగుల్ ప్లేసర్వీసులు లేకుండానే విడుదల చేస్తోంది. దీంతో చాలా మంది కస్టమర్లు హువావేకు దూరమవుతారని ఎక్స్పర్టులు చెబుతున్నారు.