న్యూఢిల్లీ: కమిటీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) విషయంలో.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)కు ఊరట లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీవోఏ.. ఐవోఏ బాధ్యతలను చేపట్టరాదని సుప్రీంకోర్టు గురువారం స్టేటస్ కోను విధించింది. ఐవోఏ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఢిల్లీ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన సీవోఏను మంగళవారం నియమించింది. దీనిని సవాల్ చేస్తూ.. ఐవోఏ గురువారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సి.టి రవికుమార్తో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.
సీవోఏలాంటి ఎన్నుకోబడని సంస్థలను.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) గుర్తించడం లేదని కేంద్రం, ఐవోఏ తర ఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ సీవోఏను కొనసాగిస్తే.. ఐవోఏపై ఐవోసీ బ్యాన్ కూడా విధించే అవకాశాలు లేకపోలేదని వాదించారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఇండియా.. ఒలింపిక్, ఇతర మెగా ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్ అయ్యే అవకాశాలు 99 శాతం ఉన్నాయని మెహతా చెప్పారు. ఇప్పటికే ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) విషయంలో బ్యాన్ విధించబడిందని గుర్తు చేశారు. మొత్తం వాదనలు విన్న ధర్మాసనం.. స్టేటస్ కోను విధిస్తూ సోమవారానికి విచారణను వాయిదా వేసింది.