ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన చైనా పెట్టుబడులపై సెబీ ఆరా తీస్తోంది. వేరే ఏవైనా కంపెనీలు తమకు చైనాలో ఉన్న సంస్థల ద్వారా ఇండియా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయా అనేది కూడా చూడమని సెబీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చైనా కంపెనీల పెట్టుబడుల వివరాలు ఇవ్వాల్సిందిగా సంబంధిత కస్టోడియన్లను సెబీ కోరింది. కస్టోడియన్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్. సెబీ కోరినప్పుడు ఎఫ్పీఐ(ఫారిన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్) ల వివరాలను అంద చేస్తుంది. చైనీస్ ఎఫ్పీఐలకు సంబంధించిన వివరాలను మాత్రమే అడగడం ఇంతకు ముందెప్పుడూ జరగలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ‘చైనా, హాంగ్ కాంగ్ల నుంచి వచ్చిన ఇన్వెస్టమెంట్లపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సెబీకి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వచ్చాయి’ అని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఇన్వెస్టమెంట్లను ఏ కోణంలో చూడాలనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. మొదట్లో చైనా, ఇతర పొరుగు దేశాల నుంచి వచ్చే కొత్త ఇన్వెస్టమెంట్లపై మాత్రమే సెబీ దృష్టిపెట్టేదని, ప్రస్తుతం పాత ఇన్వెస్టమెంట్లపై కూడా దృష్టి పెట్టాలని సెబీకి ఆదేశాలొచ్చాయని అధికారులు అన్నారు.
కరోనా దెబ్బతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు భారీగా పడిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ కంపెనీల స్టాకులు చౌకగా లభిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీలో చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) వాటా మార్చి క్వార్టర్లో 0.8 శాతం నుంచి 1.01 శాతం పెరిగింది. చైనా బ్యాంక్ ఈ వాటాను ఓపెన్ మార్కెట్ పర్చేజ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్లో జేపీ మోర్గాన్ ఎసెట్ మేనేజ్మెంట్, సీఐఎఫ్ఎం ఏషియా పసిఫిక్ ఫండ్ జాయిట్ వెంచర్కు 13.5 శాతం వాటా ఉండడం గమనార్హం. చైనా ఎఫ్పీఐలు ఇండియా కంపెనీలలో మెజార్టీ వాటాను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో చైనాకు చెందిన 16 ఎఫ్పీఐలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి టాప్ కంపెనీలలో 1.1 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఎఫ్పీఐలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత వరకు ఇన్వెస్ట్ చేశాయో స్పష్టమైన డేటా అందుబాటులో లేదు. చైనా, జపాన్ల నుంచి వచ్చే ఇన్వెస్టమెంట్లను ట్రాక్ చేయడం కష్టమని ఎసెట్ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వాటి డీల్స్లో ఇండియన్ ఎసెట్ మేనేజర్ల పాత్ర చాలా తక్కవుని అంటున్నారు.