
- పాల్గొననున్న ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రెండో విడత జనహిత పాదయాత్ర ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. రాత్రి అక్కడే బస చేయనున్నారు.
సోమవారం ఉదయం అక్కడే శ్రమదానం ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరుగనుంది. సోమవారం సాయంత్రం వరకు వరంగల్ జిల్లాలోని వర్థన్నపేటకు చేరుకొని రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం అక్కడే శ్రమదానంలో పాల్గొంటారు. అక్కడే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకొని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.