టెలిగ్రామ్ యాప్ లో భద్రతా లోపం 

టెలిగ్రామ్ యాప్ లో భద్రతా లోపం 

ఒక వైపు టెక్నాలజీతో ముందుకు దూస్కెళ్తున్నా మరోవైపు హ్యాకర్ల ముప్పు తప్పడం లేదు. ఏ చిన్న లోపం ఉన్నా సరే అది హ్యాకర్ల పాలిట వరంలా మారుతోంది. యూజర్ల డేటాను దొంగిలించడానికి హ్యాకర్లు ఏ కొద్దిపాటి అవశం ఉన్నా వదులుకోరు. ఇటీవల కాలంలో వేగంగా పేరుపొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో భద్రతాపరమైన లోపం ఉన్నట్టు లేటెస్టుగా బయటపడింది. ఈ లోపం ద్వారా హ్యాకర్లు ఓ యూజర్ ఎక్కడున్నాడో అతడి లొకేషన్ ను ఇట్టే పట్టేయగలరని అహ్మద్ హసన్ అనే సైబర్ సైంటిస్టు చెబుతున్నారు.

టెలిగ్రామ్ లోని మీకు సమీపంలోని ప్రజలు  అనే ఫీచర్ ద్వారా యూజర్ లొకేషన్ ను కచ్చితంతగా తెలుసుకోవచ్చని హసన్ అంటున్నారు. టెలిగ్రామ్ లో ఖాతాలు ఉన్న వ్యక్తులు ప్రాంతాల వారీగా గ్రూపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, ఇలాంటి గ్రూపుల్లో తమ లొకేషన్ ను షేర్ చేసుకుని ఆపై వాటిల్లో ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ఇతరుల లొకేషన్ తెలుసుకుని వారి నెట్ కార్యకలాపాలను ట్రాక్ చేసే అవకాశం ఉందని వివరించారు. ఆ విధంగా బిట్ కాయిన్ మోసాలకు, ఇతర కుంభకోణాలకు పాల్పడుతుంటారని తెలిపారు.

అయితే దీనిపై స్పందించి టెలిగ్రామ్ యాప్ వర్గాలు … ఇదేమంత పెద్ద సమస్య కాదని స్పష్టం చేశాయి. తమ లొకేషన్ డీటెయిల్స్ ను ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం లేని సందర్భాల్లో ఈ ఫీచర్ ను ఆఫ్ చేసుకోవాలని తాము సూచనలు చేస్తుంటామని వివరించాయి.