- జులై నాటికి అటవీ అనుమతులు వచ్చేలా చూడాలి : మంత్రి ఉత్తమ్
- ప్రాజెక్టుకు ఎన్జీటీ అనుమతులు...
తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నం : డిప్యూటీ సీఎం భట్టి - ప్రతి ఎకరాకూ సాగు నీరిస్తం : మంత్రి పొంగులేటి
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్ట్లపై మంత్రుల రివ్యూ
హైదరాబాద్, వెలుగు : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్ట్ పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, భూసేకరణ, పరిహారం, అటవీ, పర్యావరణ అనుమతులు, కోర్టు కేసులను ప్రాధాన్యాంశాలుగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
పెండింగ్ అంశాల వివరాలను కలెక్టర్లు, ఆర్డీవోలకు అందించాలని సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఖమ్మం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్ట్లపై గురువారం హైదరాబాద్లోని జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సీతారామ ప్రాజెక్ట్కు ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు వచ్చాయని ఆఫీసర్లు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఏవైనా అనుమతులు పెండింగ్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ పర్మిషన్లు సాధించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు.
ప్రాజెక్టులపై కోర్టుల్లో ఉన్న కేసుల మీద బలమైన వాదనలు వినిపించేందుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ను ఢిల్లీకి పంపించాలని చెప్పారు. సీతారామ లిఫ్ట్నుంచి సాగర్ఎడమ కాల్వ ద్వారా పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
జులై నాటికి ఫారెస్ట్ అనుమతులు రావాలె
భూసేకరణ, నష్టపరిహారం, పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని, పరిహారం చెల్లింపులు పెండింగ్ ఉంటే వెంటనే చెల్లించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ, జిల్లా ఆఫీసర్లతో కలిసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అయితే, భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, కొన్ని అటవీ అనుమతులే పెండింగ్ ఉన్నాయని అధికారులు వివరించగా.. జులై చివరి నాటికి అనుమతులు సాధించాలని తేల్చి చెప్పారు.
మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు సంబంధించిన భూసేకరణలోనూ స్పీడ్ పెంచాలని సూచించారు. 9 కిలోమీటర్ల కాలువకు నాలుగు గ్రామాల్లోని 317 ఎకరాలు అవసరమని, ఇప్పటికే రెండు గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, మిగతా రెండు గ్రామాల్లోనూ పూర్తి చేయాలని చెప్పారు.
భూసేకరణకు రూ.30 కోట్లు అవసరమని, రెవెన్యూ అధికారులతో కలిసి భూములు సేకరించాలని సూచించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ పనులు 60 శాతం పూర్తయ్యాయని, ఎన్జీటీ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో పనులు నిలిచిపోయాయన్నారు.
మంత్రి పొంగులేటి సూచనకు ఓకే..
సీతారామ లిఫ్ట్లోని ప్యాకేజీ 1 నుంచి బయ్యారంలోని గిరిజన తండాలకు నీటిని ఎత్తిపోయాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదనకు మంత్రి ఉత్తమ్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి లిఫ్ట్ఎత్తు, నీళ్ల వినియోగం, ఆర్థిక భారం, ఆయకట్టు తదితర అంశాలతో రిపోర్ట్ తయారు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్ట్బ్యాక్ వాటర్తో భద్రాచలం డివిజన్ ముంపుపై త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో సమావేశం అవుతామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు అవసరమైన రూ.3.20 కోట్ల ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉందన్నారు.
యాటలకుంట టన్నెల్– సత్తుపల్లి ట్రంక్ కాలువ పనుల్లో భాగంగా నాగుపల్లి పరిధిలో 74 ఎకరాల భూసేకరణ కేసు కోర్టులో ఉందని అధికారులు వివరించగా... స్పందించిన మంత్రి తుమ్మల న్యాయపరమైన సమస్యలను త్వరగా పరిష్కరించి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్జీటీ అడ్డంకులు తొలగిస్తం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన లీగల్ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఎన్జీటీ క్లియరెన్స్ తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సీతమ్మ సాగర్ బ్యారేజీ ఎన్జీటీ క్లియరెన్స్, లీగల్ అడ్డంకులను తొలగించుకోవడానికి అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు జరుపుతున్నామని, సాగునీటి శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో, ఎక్కువ ఎకరాలను సాగులోకి తీసుకురాగలిగే చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి ఎకరాకూ సాగునీరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనాలు అందిస్తామన్నారు.
భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల విడుదల వంటి సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా భవిష్యత్ను మార్చే ప్రాజెక్ట్ అని, పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు పాత ఆయకట్టును స్థిరీకరించే అవకాశం కలుగుతుందన్నారు.
