- మార్కెట్ పతనంతో నష్టపోతున్న ఇన్వెస్టర్లు
- బుధవారం 19,150 దిగువకు పడిపోయిన నిఫ్టీ
- మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు మరింత పడే ఛాన్స్
ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు బుధవారం సెషన్లోనూ భారీగా పతనమయ్యాయి. ఫ్లాట్గా ఓపెన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ మధ్యాహ్నం సెషన్లో సుమారు ఒక శాతం మేర నష్టపోయాయి. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఇప్పటిలో ఆగేటట్టు కనిపించకపోవడంతో పాటు యూఎస్ ట్రెజరీ ఈల్డ్లు 18 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం, కొన్ని కంపెనీల రిజల్ట్స్ ట్రేడర్ల అంచనాలను అందుకోకపోవడంతో ఇండెక్స్లు భారీగా పడుతున్నాయి. నిఫ్టీ బుధవారం 160 పాయింట్లు (0.83 శాతం) పడి 19,122 దగ్గర క్లోజయ్యింది. కీలక లెవెల్ అయిన 19,300 ను మార్నింగ్ సెషన్లో క్రాస్ చేసినా, పైన సస్టయిన్ కాలేకపోయింది. ఈ లెవెల్ బ్రేక్డౌన్ అయ్యాక ఇండెక్స్ మరింత పడింది. సెన్సెక్స్ 523 పాయింట్లు తగ్గి 64,049 దగ్గర ముగిసింది. కేవలం నిఫ్టీ, సెన్సెక్స్ మాత్రమే కాకుండా బ్రాడ్ మార్కెట్ మొత్తం బుధవారం నెగెటివ్లో కదిలింది. స్మాల్క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీనిని బట్టి మార్కెట్ బలహీనంగా ఉందని తెలుస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. గత ఐదు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.15 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.323.82 లక్షల కోట్ల నుంచి రూ.308.73 లక్షల కోట్లకు పడింది. ‘ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో మార్కెట్ పడుతోంది. మిడిల్ ఈస్ట్లో అనిశ్చితి కొనసాగుతుండడంతో యూఎస్ బాండ్ ఈల్డ్లు, క్రూడాయిల్ రేట్లు తగ్గినా మార్కెట్ పెద్దగా పెరగకపోవచ్చు. జియో పొలిటికల్ టెన్షన్లు తగ్గేంత వరకు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించే అవకాశం ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు.
మార్కెట్ పతనానికి కారణాలు..
1.మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో మరిన్ని దేశాలు పాల్గొంటాయనే భయాలు పెరిగాయి. క్రూడాయిల్ ప్రొడక్షన్ మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా జరుగుతోంది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం కొనసాగితే క్రూడాయిల్ ధరలు ఇంకా పెరగొచ్చు. ఇండియా వంటి దేశాలపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 90 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే చాలా దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. గ్లోబల్ ఎకానమీ మరింత క్షీణిస్తుంది.
2. యూఎస్ డాలర్, యూఎస్ బాండ్ ఈల్డ్లను పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానాలుగా పిలుస్తారు. తాజాగా ఈ రెండూ కూడా భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. దీంతో ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు బయటకు వెళ్లిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు మార్కెట్లో నికర అమ్మకందారులుగా కొనసాగడానికి ఇదే కారణం. ఈ ఏడాది సెప్టెంబర్లో నికరంగా రూ.14,768 కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు అమ్మేయగా, ఈ నెలలో ఇప్పటి వరకు రూ.10,345 కోట్ల షేర్లను విక్రయించారు.
3. దేశ స్టాక్ మార్కెట్ల వాల్యుయేషన్ హైలో ఉండడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. మిడ్క్యాప్, స్మాల్ ఇండెక్స్లు ఈ మధ్య కాలంలో ఆల్ టైమ్ గరిష్టాలను టచ్ చేసిన విషయం తెలిసిందే. లార్జ్ క్యాప్ షేర్ల కంటే మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని, ఈ షేర్ల పతనం కొనసాగొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ విజయకుమార్ అన్నారు.
4. కొన్ని కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల రిజల్ట్స్ ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయాయి. బ్యాంకుల మార్జిన్స్ పడిపోయాయి.
5. యూఎస్ బాండ్ ఈల్డ్లు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లలో వోలటాలిటీ కనిపిస్తోంది. బుధవారం సెషన్లో సింగపూర్, సౌత్ కొరియా మార్కెట్లు రెడ్లో ముగియగా, చైనా, హాంకాంగ్, జపాన్ మార్కెట్లు మాత్రం పాజిటివ్గా కదిలాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా
ట్రేడయ్యాయి.