- రికవరీ అయిన కరోనా నష్టాలు
- టెక్, ఫార్మా షేర్ల దూకుడు
- బైడెన్ గెలిచినా పాలసీల మార్పులు ఉండకపోవచ్చు
- సెనేట్లో ట్రంప్ పార్టీకే పట్టు: ఎనలిస్టులు
బిజినెస్ డెస్క్, వెలుగు: అమెరికా ప్రెసిడెంట్ రేసులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జోసెఫ్ బైడెన్ ముందున్నప్పటికీ ఇండియన్ మార్కెట్లు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయి. జో బైడెన్ గెలిచినా పాలసీలలో పెద్దగా మార్పులుండవని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా హెచ్ 1 బీ వీసా సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీంతో గురువారం సెషన్లో టెక్నాలజీ, ఫార్మా కంపెనీ షేర్లు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ తిరిగి 41,000 స్థాయిని దాటింది. కరోనా నష్టాలను సెన్సెక్స్ తిరిగి రికవరీ చేయగలిగింది. గతేడాది డిసెంబర్ 31 న 41,254 వద్ద క్లోజయిన సెన్సెక్స్, గురువారం ఈ స్థాయిని అధిగమించింది. గురువారం సెషన్లో సెన్సెక్స్ 724 పాయింట్లు లాభపడి 41,340 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 212 పాయింట్లు లాభపడి 12,120 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్లోని అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్ తప్ప మిగిలిన 48 షేర్లు పాజిటివ్గా క్లోజయ్యాయి.
జో బైడెన్తో మార్కెట్లు ముందుకేనా?
యూఎస్ ఎలక్షన్ కౌంటింగ్లో గురువారం నాటికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు 264 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇంకా కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. మ్యాజిక్ ఫిగర్ 270 ను చేరుకోవడంలో జో బైడెన్ ముందున్నారు. జో బైడెన్ గెలిస్తే ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లు లాభపడతాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ను మరింత కఠినం చేయడం, కార్పొరేట్ ట్యాక్స్లను 21 శాతం నుంచి 28 శాతానికి పెంచడం వంటి ప్లాన్స్ను బైడెన్ వేశారు. దీంతో ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ ఆసియా ఈక్విటీ మార్కెట్ల వైపు వస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా యూఎస్ ప్రభుత్వం కొత్తగా స్టిమ్యులస్ ప్యాకేజిని తీసుకురానుందని, ఈ అంశాలు ఆసియా మార్కెట్లు పెరగడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఐటీ, కెమికల్స్ షేర్లకు లాభమని, డెమొక్రట్లు గెలిస్తే ఫార్మా షేర్లు పెరుగుతాయని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ట్రంప్ ఓడిపోయినా మార్కెట్లు భారీగా పడవనే విషయం తెలుస్తోంది. యూఎస్ సెనేట్లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగనుంది. దీంతో బైడెన్ ప్లాన్ వేస్తున్న ట్యాక్స్ పెంపు అమలులోకి రాకపోవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ పంకజ్ పాండే అన్నారు. మార్కెట్లకు అతిపెద్ద పాజిటివ్ ఇదేనని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బైడెన్ గెలిచినాపాలసీ మార్పులు లేదా ట్యాక్స్ పెంచడం వంటివి అంత సులభం కాదని ఎనలిస్టులు అంటున్నారు. సెనేట్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో బైడెన్ గెలిచినా టెక్ కంపెనీలను ఇబ్బంది పెట్టే మార్పులు ఉండకపోవచ్చని చెప్పారు. ట్రంప్ గెలిస్తే కరోనా కేసులున్నా, ఎకానమీ లాక్డౌన్ ఉండదని, బైడెన్ గెలిస్తే మరిన్ని స్టిమ్యులస్ ప్యాకేజిలు ఉంటాయని ఎనలిస్ట్లు చెబుతున్నారు.
గ్లోబల్గా పాజిటివ్..
రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు యూఎస్ సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లలో తమ కంట్రోల్ను కాపాడుకుంటాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ మార్చదనే అంచనాలుండడంతో అమెరికా మార్కెట్లు ర్యాలీ చేశాయి. గత సెషన్లో యూఎస్ డౌజోన్స్ 368 పాయింట్లు లాభపడి 27,848 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 74 పాయింట్లు పెరగగా, నాస్డాక్ 430 పాయింట్ల లాభపడింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తమ బాండ్ కొనుగోళ్లును పెంచడంతో ఇంగ్లండ్ మార్కెట్లు గురువారం సెషన్లో పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. జపాన్ నికాయ్ 410 పాయింట్లు లాభపడగా, సౌత్ కొరియా కొస్పి56 పాయింట్లు పెరిగింది. ట్రేడ్ టారిఫ్లకు సంబంధించి బైడెన్తో చైనా సంప్రందింపులు చేసే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ ఎలక్షన్లో బైడెన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో చైనా మార్కెట్లు పెరిగాయి. షాంఘై 43 పాయింట్లు పెరగగా, హాంకాంగ్ హంగ్సెంగ్ 741 పాయింట్లు లాభపడింది.
పెరిగిన రూపాయి విలువ..
ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడవ్వడంతో పాటు, మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనంగా ఉండడంతో గురువారం సెషన్లో డాలర్ మారకంలో రూపాయి 40 పైసలు బలపడింది. గత సెషన్లో 74.76 వద్ద క్లోజయిన రూపాయి, గురువారం సెషన్లో 74.36 వద్ద ముగిసింది. జో బైడెన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలిచినా యూఎస్ సెనేట్లో రిపబ్లికన్ పార్టీ తమ ఆధిక్యతను నిలుపుకుంటుందని అలంకిత్ ఎండీ అంకిత్ అగర్వాల్ అన్నారు.