టాబ్లెట్ పీసీ మార్కెట్ 20 శాతం అప్.. యాపిల్ నంబర్ వన్

టాబ్లెట్ పీసీ మార్కెట్ 20 శాతం అప్.. యాపిల్ నంబర్ వన్

న్యూఢిల్లీ: భారతదేశ టాబ్లెట్ పీసీ మార్కెట్ 2025 జూన్ క్వార్టర్​తో పోలిస్తే ఈసారి 20 శాతం వృద్ధి సాధించింది. ఈ మార్కెట్‌‌లో యాపిల్ దాదాపు మూడోవంతు వాటాను దక్కించుకుని మొదటి స్థానంలో నిలిచిందని సైబర్‌‌ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రిపోర్ట్​ తెలిపింది. యాపిల్ ఐప్యాడ్ సరఫరాలు 2025 జూన్ క్వార్టర్​లో గత సంవత్సరం కంటే 10 శాతం పెరిగాయి. కొత్తగా విడుదలైన ఐప్యాడ్ 11 సిరీస్‌‌కు లభించిన బలమైన డిమాండ్, ఆన్‌‌లైన్, ఆఫ్‌‌లైన్ మార్గాల్లో మెరుగైన లభ్యత కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది. ఈ క్వార్టర్​లో యాపిల్ మొత్తం అమ్మకాల్లో 70 శాతం ఐప్యాడ్ 11 సిరీస్‌‌దే. యాపిల్ తర్వాత శామ్​సంగ్​ 27 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. దీని సరఫరాలు 15 శాతం పెరిగాయి.

గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ 5జీ మోడల్ ఈ వృద్ధికి ప్రధాన కారణం. లెనోవో మార్కెట్ వాటా 16 శాతంగా స్థిరంగా ఉండగా, సరఫరాలు 18 శాతం పెరిగాయి. షియోమీ, వన్‌‌ప్లస్ కంపెనీలు వరుసగా 81 శాతం, 95 శాతం వృద్ధిని నమోదు చేసి, 15 శాతం, 6 శాతం మార్కెట్ వాటాను దక్కించుకున్నాయి. విద్యార్థులు, గిగ్ వర్కర్లు వంటి వారి నుంచి వాల్యూ- ఫర్- మనీ టాబ్లెట్లకు మంచి డిమాండ్ ఉందని సీఎంఆర్ సీనియర్ ఎనలిస్ట్​ మోనికా కుమారి తెలిపారు. ప్రీమియం విభాగంలో యాపిల్, శామ్​సంగ్​కు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో టాబ్లెట్ మార్కెట్ 10-–15 శాతం వృద్ధిని సాధిస్తుందని సీఎంఆర్ అంచనా వేసింది. 5జీ టాబ్లెట్లు, వాల్యూ- ఫర్- మనీ ఆండ్రాయిడ్ టాబ్లెట్లకు డిమాండ్ పెరుగుతుందని రిపోర్ట్​ పేర్కొంది.