
- రాణించిన మెటల్, ఆటో షేర్లు
- డాలర్ మారకంలో రూపాయి విలువ 87.70 కి పతనం
- కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు
ముంబై: మార్కెట్లో వరుస నష్టాలకు సోమవారం బ్రేక్ పడింది. ఆటో, మెటల్ షేర్లు ర్యాలీ చేయడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 418.81 పాయింట్లు (0.52శాతం) పెరిగి 81,018.72 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్లోని 30 షేర్లలో 26 లాభపడగా, 4 నష్టపోయాయి. ఇంట్రాడేలో 493.28 పాయింట్లు (0.61శాతం) పెరిగి 81,093.19 వద్ద గరిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 157.40 పాయింట్లు (0.64శాతం) పెరిగి 24,722.75 వద్ద ముగిసింది, ఇంట్రాడేలో 169.3 పాయింట్లు పెరిగి 24,734.65 లెవెల్ను టచ్ చేసింది. సెన్సెక్స్ కంపెనీలలో టాటా స్టీల్ 4.31శాతం లాభంతో టాప్ గెయినర్గా నిలిచింది. అదానీ పోర్ట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనీలివర్ నష్టాల్లో ముగిశాయి.
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం
‘‘మెటల్, ఆటో షేర్లు ర్యాలీ చేశాయి. యూఎస్ డాలర్ విలువ పడడంతో పాటు ఆటో సేల్స్, కొన్ని ఆటో కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. వినియోగం పుంజుకుందనే విషయం ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది. అమెరికాలో నిరుద్యోగం పెరగడం, కొత్త ఉద్యోగాలు తగ్గడంతో ఫెడ్ వడ్డీ రేట్లను కట్ చేస్తుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, యూఎస్ టారిఫ్ల వల్ల ట్రేడర్లు జాగ్రత్త పడాలి”అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ సోమవారం 0.76శాతం, మిడ్క్యాప్ 1.11శాతం పెరిగాయి.
రంగాల వారీగా చూస్తే, మెటల్ 2.58శాతం, రియల్టీ 1.88శాతం, కమొడిటీస్ 1.79శాతం, సర్వీసెస్ 1.74శాతం, ఆటో 1.54శాతం, ఐటీ 1.38శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకెక్స్ మాత్రమే నష్టపోయాయి. రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘మిశ్రమ సూచనల నడుమ ఇండియన్ మార్కెట్లు అర శాతానికిపైగా లాభపడ్డాయి. యూఎస్ ఫ్యూచర్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, నిఫ్టీ రోజంతా పాజిటివ్గా కదిలింది. మెటల్, రియల్టీ, ఆటో షేర్లు ఎక్కువగా పెరిగాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు 1.5 శాతం వరకు లాభపడ్డాయి”అని వివరించారు.
ఆసియా మార్కెట్లలో హాంగ్కాంగ్ హాంగ్సెంగ్, దక్షిణ కొరియా కోస్పీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ లాభపడగా, జపాన్ నిక్కీ నష్టపోయింది. యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ 1.15శాతం తగ్గి 68.87 డాలర్లకు చేరింది. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) లు శుక్రవారం నికరంగా రూ.3,366.40 కోట్ల షేర్లను అమ్మగా, సోమవారం మరో రూ.2,400 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోతుండడంతో పాటు, టారిఫ్ అనిశ్చితులతో డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. రూపాయి సోమవారం మరో 52 పైసలు క్షీణించి 87.70 వద్ద ముగిసింది.