
‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే.. ఆ తర్వాత కెరీర్లో ఎప్పుడూ ఆ స్థాయి మరో విజయాన్ని అందుకోలేకపోయింది. ఓ వైపు గ్లామర్, మరోవైపు పెర్ఫార్మెన్స్తో మెప్పిస్తున్నప్పటికీ తనకు రావల్సినంత గుర్తింపు రాలేదని ఫీల్ అవుతుంటారు ఆమె అభిమానులు. ఇటీవల ‘మహరాజ’ అనే హిందీ చిత్రంతో ఆకట్టుకున్న షాలినీకి.. తాజాగా కోలీవుడ్ నుంచి ఓ ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’.
ఇందులో నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే సినిమాకు ఎంతో కీలకమైన పాత్రకోసం షాలిని పాండేను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో హండ్రెడ్ పర్సెంట్ కాదల్, గొరిల్లా అనే తమిళ చిత్రాల్లో నటించిన షాలినీ.. ఐదేళ్ల తర్వాత కోలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్ కిరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది.