
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ ను చంపేస్తామంటూ కొందరు దుండుగులు బెదిరింపులకు దిగారు. పవార్ ను హత్య చేస్తామని ట్విట్టర్ లో బెదిరించారు. ఈ బెదిరింపులపై శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఎన్సీపీ నేతలు ముంబై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏమైనా జరిగితే రాష్ట్ర హోంమంత్రిదే బాధ్యత..
తన తండ్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ట్విట్టర్లో కొందరు బెదిరించారని.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ఈ నేపథ్యంలో బెదిరింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ముంబై పోలీసు కమిషనర్ను కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. శరద్ పవార్కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కాల్స్ ద్వారా కొందరు దుండగులు బెదిరించారని సునీల్ రౌత్ తెలిపారు. ఉదయం మీడియాతో మాట్లాడవద్దని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్కు, తనకు హత్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ ఘటనపై ముంబై పోలీస్ కమిషనర్, రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించామని సునీల్ రౌత్ తెలిపారు.