హాంగ్జౌ: ఆసియా గేమ్స్ అథ్లెటిక్స్లో ఇండియా పతక పరుగు కొనసాగుతోంది. ఎనిమిదో రోజు పోలిస్తే జోరు తగ్గినా తొమ్మిదో రోజు ఇండియన్స్ ఏడు మెడల్స్ రాబట్టారు. ఇందులో మూడు సిల్వర్, ఓ బ్రాంజ్ మెడల్ అథ్లెటిక్స్ ఈవెంట్ల నుంచి రాగా.. రోలర్ స్కేటర్లు రెండు బ్రాంజ్ మెడల్స్తో సర్ప్రైజ్ ఇచ్చారు. మొత్తంగా ఆసియాడ్లో ఇండియా మెడల్స్ సంఖ్య 60కి చేరుకుంది. కాగా, అథ్లెటిక్స్లో సోమవారం అమ్మాయిల హవా నడిచింది. విమెన్స్ లాంగ్ జంప్లో అన్సీ సోజన్ సిల్వర్తో మెరిసింది. ఫైనల్లో అన్సీ తన పర్సనల్ బెస్ట్ను అధిగమిస్తూ మూడో ప్రయత్నంలో 6.63 మీటర్ల దూరం దూకి రెండో ప్లేస్తో రజతం ఖాతాలో వేసుకుంది.
చైనాకు చెందిన షికి జియంగ్ 6.67 మీటర్లతో గోల్డ్, వియత్నాం అథ్లెట్ యన్ యుయె (6.50 మీ) బ్రాంజ్ గెలిచారు. ఇదే ఈవెంట్లో బరిలో నిలిచిన ఇండియా స్టార్ జంపర్ శైలీ సింగ్ 6.48 మీటర్లతో ఐదో ప్లేస్తో నిరాశ పరిచింది. ఇక, 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో పారుల్ చౌదరి సిల్వర్, ప్రీతి బ్రాంజ్ సొంతం చేసుకున్నారు. పారుల్ 9 నిమిషాల 27.63 సెకండ్లతో రెండో స్థానం సాధించగా, ప్రీతి 9 నిమిషాల 43.32 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచింది. బెహ్రయిన్ రన్నర్ యవి విన్ఫ్రెడ్ 9:18.28 సెకండ్లతో ఆసియా గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ గోల్డ్ సొంతం చేసుకుంది.
మిక్స్డ్ రిలే టీమ్కు లక్
4x400 మీటర్ల మిక్స్డ్ రిలే టీమ్కు అదృష్టం తోడైంది. అజ్మల్ వరియతోడి, విత్య రామరాజ్, రాజేశ్ రమేశ్, సుభా వెంకటేశన్తో కూడిన జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. ఫైనల్లో ఇండియా 3 నిమిషాల 14.34 సెకండ్లతో రెండో స్థానం సాధించింది. తొలుత మూడో ప్లేస్తో బ్రాంజ్ నెగ్గినట్టు ప్రకటించినా.. శ్రీలంక డిస్క్వాలిఫై అవ్వడంతో ఇండియా బ్రాంజ్ను సిల్వర్కు అప్గ్రేడ్ చేశారు. మరోవైపు మెన్స్ డెకాథ్లాన్లో ఐదు ఈవెంట్లు ముగిసిన తర్వాత తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. మెన్స్ 200మీ. ఈవెంట్లో అమ్లాన్ బొర్గొహైన్ 20.98 సెకండ్లతో ఆరో ప్లేస్తో సరిపెట్టాడు.
విమెన్స్ 400మీ. హర్డిల్స్లో విత్య రామరాజ్ లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష పేరిట ఉన్న నేషనల్ రికార్డును సమం చేస్తూ ఫైనల్ చేరుకుంది. హీట్స్లో ఆమె 55.42 సెకండ్లతో టాప్ ప్లేస్తో నేరుగా ఫైనల్ బెర్తు సాధించింది. మెన్స్ హైజంప్లో సందేశ్ జెస్సె, సర్వేశ్ అనిల్ కుశారె ఫైనల్కు క్వాలిఫై అయ్యారు. మెన్స్ 800మీ. ఈవెంట్లో మొహమ్మద్ అఫ్సల్, క్రిష్ణన్ కుమార్ కూడా ఫైనల్లో అడుగు పెట్టారు.
స్కేటర్ల సర్ప్రైజ్
ఇండియా స్పీడ్ స్కేటర్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్కేటర్లు మెన్స్, విమెన్స్ 3000మీటర్ల టీమ్ రిలే ఈవెంట్లలో రెండు బ్రాంజ్ మెడల్స్తో అదరగొట్టారు. ముందుగా టీనేజర్లు కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు, ఆరతీ కస్తూరి రాజ్తో కూడిన విమెన్స్ జట్టు 4 నిమిషాల 34.861 సెకండ్లతో మూడో ప్లేస్లో నిలిచి ఆసియా గేమ్స్ స్పీడ్ స్కేటింగ్లో ఇండియాకు తొలి పతకం అందించింది. ఈ టీమ్లో తెలంగాణ అమ్మాయి బత్తుల సంజన కూడా ఉన్నా.. ఫైనల్లో బరిలోకి దిగే చాన్స్ రాలేదు. మెన్స్ రిలేలో ఆనంద్ కుమార్, సిద్దాంత్ కాంబ్లే, విక్రమ్ ఇంగలేతో కూడిన ఇండియా 4 నిమిషాల 34.861 సెకండ్ల టైమింగ్తో మూడో ప్లేస్తో మరో బ్రాంజ్ అందించింది. 2010 ఆసియా గేమ్స్లో రోలర్ స్పోర్ట్స్ను తొలిసారి ప్రవేశపెట్టగా.. హైదరాబాదీ అనూప్ కుమార్ మెన్స్ సింగిల్స్ ఫ్రీ స్కేటింగ్తో పాటు పెయిర్స్ స్కేటింగ్ ఈవెంట్లో అవని పాంచల్తో కలిసి బ్రాంజ్ మెడల్స్ గెలిచాడు.
సుతీర్థ-ఐహికకు బ్రాంజ్
టేబుల్ టెన్నిస్ విమెన్స్ డబుల్స్ ఈవెంట్లో సుతీర్థ ముఖర్జీ–ఐహికా ముఖర్జీ జోడీ ఇండియాకు తొలి మెడల్గా బ్రాంజ్ అందించారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో ఈ జంట 3–4తో నార్త్ కొరియాకు చెందిన సుయంగ్ చ–సుగ్యోంగ్ పాక్ చేతిలో పోరాడి ఓడి కాంస్యంతో తిరిగిచ్చింది.దాంతో, టీటీలో ఇండియా పోరాటం ముగిసింది.
హర్మన్, మన్దీప్ హ్యాట్రిక్
కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (2, 4, 34 నిమిషాలు), మన్దీప్ సింగ్ (18, 24, 46వ ని) హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగడంతో ఇండియా మెన్స్ హాకీ టీమ్ పూల్–ఎ చివరి మ్యాచ్లో ఇండియా 12–0తో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. పూల్లో అజేయంగా నిలిచింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో కొరియాతో పోటీ పడనుంది.
ఆరు ఈవెంట్ల క్వార్టర్స్లో ఆర్చరీ టీమ్స్
ఆర్చరీలో పోటీపడ్డ ఆరు టీమ్ ఈవెంట్లలో ఇండియన్స్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టి పతకాలకు చేరువయ్యారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో టాప్ సీడ్ జ్యోతి సురేఖ–దియోతలే 159–151తో యూఏఈకి చెందిన అమ్నా–బినార్మోను ఓడించి క్వార్టర్స్ చేరింది. రిక్వర్ మిక్స్డ్లో అటాను–అంకిత 6–2తో మలేసియా జంటను ఓడించింది. కాంపౌండ్, రికర్వ్లో మెన్స్, విమెన్స్ జట్లు కూడా క్వార్టర్స్ చేరాయి. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో దియోతలే, అభిషేక్ శర్మ, జ్యోతి సురేఖ, అదితి స్వామి తమ కేటగిరీల్లో క్వార్టర్స్ చేరి గోల్డ్ మెడల్ రేసులో నిలిచారు. రికర్స్ మెన్స్లో ధీరజ్, అటాను దాస్ ముందంజ వేయగా.. అమ్మాయిలు ఇంటిదారి పట్టారు.
జోష్నకు షాక్.. క్వార్టర్స్లో సౌరవ్
మెడల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇండియా స్టార్ స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పకు విమెన్స్ సింగిల్స్లో షాక్ తగిలింది. ప్రిక్వార్టర్స్లో జోష్న 1–3తో లోయర్ ర్యాంకర్ హెయో (సౌత్ కొరియా) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. తన్వీ ఖన్నా 3–0తో అరిచయ జుజిత్ (థాయ్లాండ్)ను ఓడించి క్వార్టర్స్ చేరగా.. మెన్స్ ప్రిక్వార్టర్స్లో స్టార్ ప్లేయర్ సౌరవ్ఘోశాల్ 3–0తో అమార్ అట్లమిమి (కువైట్)ను చిత్తు చేసి క్వార్టర్స్లో అడుగు పెట్టాడు. మిక్స్డ్లో అనాహత్–అభయ్ గ్రూప్–డి మ్యాచ్లో 2–0తో థాయ్లాండ్ ప్రత్యర్థి జంటపై గెలిచింది.
రెండో రౌండ్లో శ్రీకాంత్, సాత్విక్–చిరాగ్
బ్యాడ్మింటన్ మెన్స్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ గెలిచిన ఇండియా షట్లర్లు వ్యక్తిగత విభాగాల్లో శుభారంభం చేశారు. మెన్స్ సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో 21–11, 21–16తో ఫాట్ లె డుక్ (వియత్నాం)ను ఓడించి రెండో రౌండ్ చేరాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట 21–11, 21–16తో చో హిన్–లుయి చున్ (హాంకాంగ్) జంటను ఓడించింది. మిక్స్డ్లో సాయి ప్రతీక్–తనీషా జంట కూడా తొలి రౌండ్లో నెగ్గింది.