
శింబు హీరోగా వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘అరసన్’. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో టీజర్ను విడుదల చేశారు. హీరో ఎన్టీఆర్ తెలుగు టీజర్ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి బెస్ట్ విషెస్ అందించారు.
ఐదున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్కు పాత నేరస్థుడైన శింబు ఒకప్పటి నేర సామ్రాజ్యం గురించి చెబుతుంటాడు. నరికినోళ్లు, చచ్చినోళ్ళు, పేర్లు, ప్రదేశాలు, సమయం అన్నీ నిజాలు అయినప్పటికీ, కల్పితం అని వేయమని చెబుతాడు.
అలాగే ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని సూచిస్తాడు. ఈలోపు కోర్టు వాయిదా కోసం జడ్జి ముందుకెళ్లి.. తాను ఆ ముగ్గురిని చంపలేదని, ఆరోజు తాను చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు వెళ్లానని, తనపై తప్పుడు కేసు బనాయించారని ఆవేదనగా చెబుతాడు.
సీన్ కట్ చేస్తే నైంటీస్లో హత్య జరిగిన రోజు.. చేతిలో వేట కత్తి, శరీరమంతా రక్తంతో యంగ్ లుక్లో కనిపిస్తాడు శింబు. తన గెటప్, అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ గతంలో తెరకెక్కించిన ‘వడచెన్నై’ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని వీడియో చివర్లో తెలియజేశారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.