- ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు.. 24 గంటలు ఫోన్ ట్యాపింగ్
- 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్
- రేవంత్రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్
- ఎక్కడికెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత
- వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపై గురి.. డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్!
- సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు
- టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2015 నుంచే రేవంత్రెడ్డిపై నిఘా పెట్టినట్టు తేలింది. రేవంత్ టార్గెట్గానే స్పెషల్ ఆపరేషన్స్ జరిగినట్టు స్పెషల్ టీమ్ దర్యాప్తులో వెల్లడైంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ‘రేవంత్రెడ్డి’గా ఎస్ఐబీ పనిచేసినట్టు బయటపడింది.
ప్రతి రోజు రేవంత్రెడ్డి ఎక్కడికెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే సమాచారం అప్పటి సీఎం కేసీఆర్కు ముందుగానే చేరేదని తెలిసింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రణీత్రావు టీమ్ చేరవేసినట్టు స్పెషల్ టీమ్ పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో 200 మీటర్ల దూరంలో వార్రూమ్ ఏర్పాటు చేసి, ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు.
ఓటుకు నోటు కేసు నుంచే..
రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన ఇంటితో పాటు గాంధీభవన్ పరిసరాలపై కూడా ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. సాధారణంగా పొలిటికల్ లీడర్ల సమాచారం సేకరించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా సంబంధిత లీడర్ల ఫోన్ నంబర్స్, వ్యక్తిగత సమాచారం సేకరిస్తుంటారు. ఇందులో భాగంగా 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ‘ఓటుకు నోటు’
వ్యవహారాన్ని గుర్తించారు. ఇదే అదునుగా గత ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసే విధంగా ప్రభాకర్ రావుకు స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు అప్పగించింది. మావోయిస్టులు, టెర్రరిస్టులపై నిఘాకు బదులు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డిపై నిఘా పెట్టింది.
ఐదేండ్లుగా ఆపరేషన్ టార్గెట్ ‘రేవంత్ రెడ్డి’
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో రేవంత్ రెడ్డి టార్గె ట్గా స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్(ఎస్ఓటీ)ని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును చీఫ్గా నియమించింది. రేవంత్రెడ్డి టార్గెట్గా 2018 నుంచి ఎస్ఓటీ టీమ్ పనిచేసింది. మాదాపూర్లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్స్, పరికరాలను కొలుగోలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం రేవంత్రెడ్డి ఇంటి సమీపంలో మొత్తం 27 మంది మఫ్టీ పోలీసులు
టెక్నికల్ సిబ్బందితో వార్రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్ నుంచే 24 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతి కదలికను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించేవారని తెలిసింది. 2021లో పార్టీ మారిన ఈటల రాజేందర్పై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
వార్రూమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్
రేవంత్ రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు, సోదరులు, పార్టీ ముఖ్యనేతల ఫోన్ నంబర్స్ను ఐదేండ్ల పాటు అడ్డగోలుగా రికార్డ్ చేశారని దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలిసింది. ప్రతి ఫోన్ సంభాషణను రికార్డ్ చేసి, ఎస్ఐబీ చీఫ్ ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు అందించేవారని స్పెషల్ టీమ్ గుర్తించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయనే వివరాలను సేకరించారు. రేవంత్రెడ్డికి ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ఉన్న వారితో పాటు ఆయన కంపెనీలో భాగస్వాములు, బంధువులు.
ఆయన ఇంటికి వచ్చే ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇప్పటికే స్పెషల్ టీమ్ పోలీసులు గుర్తించారని తెలిసింది. ఇలాంటి సమాచారంతో ప్రతిపక్ష పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన బిగ్షాట్స్ను బ్లాక్మెయిల్ చేసేవారని సమాచారం. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో బయటపడిందని తెలిసింది.
క్యాష్ ట్రాన్స్ఫర్కు మాజీ ఐఏఎస్ సేవలు!
ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్షాల డబ్బును సీజ్ చేసేందుకు ఓ ఎమ్మెల్సీ పర్యవేక్షణలో పోలీసులు స్పెషల్ రెయిడ్స్ చేసేవారు. ప్రణీత్రావు అందించిన సమాచారంతో కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ ఐఏఎస్ అధికారి కూడా డబ్బులు తరలించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో ఆయన పేరు ప్రస్తావించినట్టు సమాచారం. హవాలా రూపంలో డబ్బు తరలించడంతోపాటు నియోజకవర్గాలకు డబ్బు సప్లయ్ చేసేందుకు
ప్రత్యేక వాహనాలను కూడా ఆ మాజీ ఐఏఎస్ అధికారి సిద్ధం చేసేవారని తెలిసింది. పోలీస్ వెహికల్స్, మఫ్టీలో పోలీసులతో గమ్యస్థానాలకు డబ్బు తరలించేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఇదంతా ప్రభాకర్రావు, ప్రణీత్రావు, రాధాకిషన్ రావుకు మాత్రమే ముందుగా తెలిసేదని పోలీసులు గుర్తించారు.ఈ మేరకు ఎమ్మెల్సీతో పాటు మాజీ ఐఏఎస్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపించేందు కు స్పెషల్ టీమ్ అధికారులు టెక్నికల్ ఆధారాలు సేకరించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఫోన్ నంబర్స్, వాట్సాప్ డేటా ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. 38 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్స్తో పాటు నిందితులైన పోలీస్ అధికారులు వెల్లడించిన సమాచారంతో కూడిన సీల్డ్ కవర్ను శుక్రవారం కోర్టులో డిపాజిట్ చేశారు.
రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. దీని ఆధారంగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు.