ప్లాన్ ప్రకారమే లాభాల వాటా ప్రకటనలో జాప్యం : వాసిరెడ్డి సీతారామయ్య

ప్లాన్ ప్రకారమే లాభాల వాటా ప్రకటనలో జాప్యం : వాసిరెడ్డి సీతారామయ్య
  • సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు​ వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కుట్ర పూరితంగానే 2024–-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలు, వాటాను ప్రకటించడంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్  వర్కర్స్  యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీడీకే 11 ఇంక్లైన్​లో జరిగిన గేట్  మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 

ఈ నెల 12న హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో జరిగిన స్ట్రక్చర్  మీటింగ్​లో లాభాలను ప్రకటించాలని, 35 శాతం వాటా త్వరగా చెల్లించాలని, గత సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్​ల అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయాలని అడిగితే దాటవేశారన్నారు. దీంతో ఆ మీటింగ్​ను బహిష్కరించామని చెప్పారు. యాజమాన్యం మొండివైఖరి, కాలయాపన చేయడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, దీనిపై ఈ నెల 19న జనరల్  మేనేజర్  కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్​ సెక్రటరీ ఆరెల్లి పోషం, రంగు శ్రీను, ఎస్.వెంకట్ రెడ్డి, సిద్దమల్ల రాజు, సయ్యద్  సోహేల్, గండి ప్రసాద్, ఎం చక్రపాణి పాల్గొన్నారు. అంతకుముందు గని ఆవరణలోని తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.