నాగర్కర్నూల్, వెలుగు: జిల్లాలోని 8 జీపీల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి, వెల్దండ మండలం బండోనిపల్లె, కేస్లీతండా, తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల, తాళ్లపల్లి, ఊర్కొండ మండలం గుండ్లగుంటపల్లిలో సర్పంచ్ స్థానానికి ఒక్కో నామినేషన్ దాఖలైంది. పలు గ్రామాల్లో వార్డులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటీని అనంతరం వారిని అధికారికంగా గెలిచినట్లు ప్రకటించనున్నారు.
ఇక మొదటి విడత ఎన్నికలు జరిగే జీపీల్లో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని ఆరు మండలాల్లోని 151 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పోస్ట్లకు 958 నామినేషన్లు దాఖలయ్యాయి. పలు మండలాల్లో అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కల్వకుర్తిలో -153, తాడూరులో-158, తెల్కపల్లిలో-192, ఊర్కొండలో -91, వంగూరులో-188, వెల్దండలో-176 నామినేషన్లు దాఖలయ్యాయి.
రెండవ విడతలో జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన151 గ్రామపంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ మొదలైంది. కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, నాగర్కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల్లో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
మొదటి విడతలో పెద్ద ఎత్తున నామినేషన్లు..
వనపర్తి: వనపర్తి జిల్లాలో మొదటి విడతలో గోపాల్పేట, పెద్దమందడి, ఖిల్లాగణపురం, రేవల్లి, ఏదుల మండలాల్లోని 87 సర్పంచ్, 780 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు రాత్రి పొద్దు పోయేంత వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సర్పంచ్ స్థానాలకు 695, వార్డు సభ్యులకు 2,015 నామినేషన్లు వచ్చాయి. పెద్దమందడి మండలం నాగులకుంటతండా, ఖిల్లాగణపురం మండలం కర్నెతండా, గోపాల్పేట మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.
గద్వాలలో సర్పంచ్లకు 974 నామినేషన్లు
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడతలో106 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, సర్పంచ్ స్థానాలకు మొత్తం 724 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 974 వార్డులకు 1,903 నామినేషన్లు వేశారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఆదివారం ఉదయం ఫైనల్ నామినేషన్ లిస్ట్ను ఆఫీసర్లు రిలీజ్ చేశారు.
