దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో తుది తీర్పునిచ్చింది పటాన్ కోర్టు. ఏడుగురు నిందితులలో ఆరుగురిని దోషులుగా..ఒకరిని నిర్దోషిగా తేల్చింది కోర్టు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రామ్, దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ సహా మరో ఇద్దరు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. సాంజీ రామ్ కొడుకు విశాల్ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు . ఇవాళ మధ్యాహ్నం దోషులకు శిక్ష ఖరారు చేయనుంది కోర్టు.
గత ఏడాది జనవరిలో జమ్ముకశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. నిందితులకు ఉరి శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.అయితే కేసు విచారణకు జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్ కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సాంజీ రామ్ సహా ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. నిందితులు దోషులుగా తేలితే యావజ్జీవం గానీ, ఉరి శిక్ష గానీ విధించే అవకాశం ఉంది.
మొత్తం 8 మంది నిందితుల్లో ఏడుగిరిపై అత్యాచారం, హత్య అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై ఈ నెల 3నే విచారణ పూర్తి కాగా, నేడు జిల్లా సెషన్స్ జడ్జ్ తేజ్విందర్ సింగ్ తీర్పు వెల్లడించారు.