దేశమేదైనా కోపమొక్కటే

దేశమేదైనా కోపమొక్కటే

ప్రపంచంలోని పలు దేశాల్లో ఈమధ్య ప్రశాంత వాతావరణం కరువైంది. తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టే  ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలపై ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. పాలనలోని లోపాలను  నాయకుల దృష్టికి తెచ్చేందుకు నిరసన ప్రదర్శలు నిర్వహిస్తున్నారు. ఉద్యమాలపై సర్కార్ల యాక్షన్​కు తగ్గట్లే రియాక్షన్​ ఇస్తున్నారు. ఈ పోరాటాల్లో యూత్​ ఎక్కువ పాల్గొంటున్నారు. మెట్రో రేట్ల పెంపుతో చిలీలో మొదలైన ఉద్యమం ఇప్పుడు ట్యాక్స్​ తగ్గింపు డిమాండ్​ వరకు పాకింది. వాట్సాప్​ కాల్స్​పై ట్యాక్స్ పట్ల​ లెబనాన్​, పూర్తి ప్రజాస్వామ్య సాధన కోసం హాంకాంగ్​ అట్టుడుకుతున్నాయి.

ఈ ఏడాది వివిధ దేశాల జనాల ఆలోచనల్లో మార్పులు ‘కొట్టొచ్చినట్లు’ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్లు తప్పులు చేస్తే పబ్లిక్​ ఊరుకోవట్లేదు. సరిచేసుకునే దాక వదలట్లేదు. రోడ్ల పైకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా అడ్డుకోవాలని చూస్తే వెనకడుగు వేయకుండా ఎంతదాకైనా తెగిస్తున్నారు. అసమానతలు, అటానమీ లేకపోవటం, ఫ్రస్టేషన్​.. కారణం ఏదైనా కావొచ్చు. లీడర్లు ముందుచూపు లేకుండా చేపట్టే చర్యల్ని ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. చిలీ, లెబనాన్, హాం​కాంగ్​​ల్లో వచ్చిన మూవ్​మెంట్లే ఉదాహరణ.

చిలీలో కొత్త రాజ్యాంగం రానుంది

​రవాణా ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ చిలీలో ప్రారంభమైన ఆందోళనలు చివరికి రాజ్యాంగంపై రెఫరెండానికి దారితీశాయి. వచ్చే ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ జరిపి కొత్త రాజ్యాంగానికి రూపకల్పన చేయాలని రీసెంట్​గా నిర్ణయించారు. లాటిన్​ అమెరికాలోని డబ్బున్న దేశాల్లో చిలీ ఒకటి. ఆదాయాల్లో అసమానతలూ అక్కడ ఎక్కువే. రవాణా ఛార్జీల పెంపు ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని శాంటియాగోలో వేల సంఖ్యలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. మెట్రో స్టేషన్లను ముట్టడించారు.

మెట్రో సబ్​వే టికెట్ల రేట్లు పెంచేందుకు తెరపైకి తెచ్చిన ప్రపోజల్​పై నిరసనలు పెరుగుతుండటంతో శాంటియాగోలో ఎమర్జెన్సీ పెట్టారు. ఆందోళనకారులకు, సెక్యూరిటీ ఫోర్సెస్​కి మధ్య జరిగిన గొడవల్లో 18 మంది చనిపోయారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. షాపులు, వ్యాపార సంస్థలపై విరుచుకుపడ్డారు. కొన్నింటికి నిప్పుపెట్టారు. ఎప్పుడూ ప్రశాంతగా కనిపించే ఈ దేశం వయొలెన్స్​తో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఈ ఆందోళనలు హెల్త్​, ఎడ్యుకేషన్​, పెన్షన్​, వేజ్​ అంశాలకూ విస్తరించాయి.

దిగొచ్చిన ప్రభుత్వం

ప్రజల కోపాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పెంచిన ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది. అయినా ఆందోళనలు తగ్గలేదు. ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ జనం నేషనల్​ బోర్డర్లలో సైతం నిరసనకు దిగారు. 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ప్రదర్శనలు జరిగినట్లు హిస్టారియన్లు చెబుతున్నారు. ఆర్మీ జనరల్​ అగస్టో పినోచెట్​ 17 ఏళ్లపాటు నియంతలా సాగించిన పాలనకు 1990లో తెర దించే దాక వెనక్కి తగ్గని చిలీ ప్రజల తెగువ మళ్లీ కనిపించిందని అంటున్నారు. చిలీలో చాలా వరకు తాత్కాలిక ఉద్యోగాలే ఉంటాయి. క్వాలిటీ, స్కిల్డ్​ వర్క్​ కోసం యూత్​, మహిళలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. పెన్షన్లు, హెల్త్​కేర్, పబ్లిక్​ ఎడ్యుకేషన్​ వంటి రంగాల్లో ఎకనమిక్​ రిఫార్మ్స్ తేవాలని కోరుతున్నారు. సైనిక పాలన ముగిసి ప్రజాస్వామ్య పాలన మొదలైన ఈ 30 ఏళ్లలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళనలూ అందులో భాగమేనని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.   ​

లెబనాన్​లో సర్కారే  మారింది

వాట్సాప్, ఫేస్​బుక్​ తదితర యాప్​ల్లో వాయిస్​ ఓవర్​ ఇంటర్నెట్​ ప్రొటోకాల్​ వాడకంపై ఛార్జ్​ విధించాలన్న ప్రతిపాదన లెబనాన్​లో ఏకంగా ప్రభుత్వమే దిగిపోయేందుకు కారణమైంది. ట్యాక్స్​ వేయటానికి సర్కారు ప్రయత్నించటాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు వేల సంఖ్యలో రోడ్ల పైకి వచ్చారు. దీంతో గవర్నమెంట్​ గంటల వ్యవధిలోనే దిగొచ్చింది. దీనికితోడు ప్రభుత్వం అనుసరిస్తున్న క్రోనీ క్యాపిటలిజం వల్లే ఈ కష్టాలంటూ జనం కోపంగా ఉన్నారు. అవినీతి, ప్రభుత్వాల మాటున మత పెద్దల చెత్త పెత్తనాల కారణంగా అభివృద్ధి అడుగంటుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలను చల్లార్చటానికి, ఎలక్ట్రిసిటీ సెక్టార్​ నష్టాలను తగ్గించటానికి ఆఫీసర్ల జీతాల్లో 50 శాతం కోత పెట్టారు. బ్యాంక్​ లాభాలపై లెవీ విధించారు. అయినా నిరసనకారులు సంతృప్తి చెందలేదు. దేశంలో ప్రశాంత వాతావరణం కల్పించటంలో ఫెయిల్​ అయ్యానన్న భావనతో లెబనాన్​ ప్రధాని సాద్​ హరిరి ఈమధ్య రాజీనామా చేశారు. దీంతో అక్కడ కొత్త సర్కారు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆందోళనలతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హాంకాంగ్​ కొత్త డిమాండ్..​ ప్రజాస్వామ్యం

అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో తొమ్మిది నెలల నుంచి జరుగుతున్న ఆందోళనలు క్రమంగా పూర్తి ప్రజాస్వామ్య డిమాండ్​ దిశగా మలుపుతిరిగాయి. అప్పగింత బిల్లుపై ప్రభుత్వాన్ని వెనకడుగు వేయించటంలో సక్సెస్​ అయిన నిరసనకారులు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. ప్రదర్శనలను, ర్యాలీలను బ్యాన్​ చేసినా ఎవరూ లెక్క చేయట్లేదు. ఉద్యమ అణచివేత ప్రయత్నాలకు లొంగేది లేదని, పూర్తి ప్రజాస్వామ్యం సాధించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.    హాంకాంగ్​లో తొలిసారిగా మార్చిలో నిరసనలు చెలరేగాయి. జూన్ నాటికి​ తీవ్ర రూపం దాల్చి ఎకానమీని అతలాకుతలం చేశాయి. ఊపిరాడని రీతిలో ఊపందుకున్న ఆందోళనలతో ప్రభుత్వం అప్పగింత బిల్లుని విత్​డ్రా చేసుకుంది. హాంకాంగ్​ చైనాలో అంతర్భాగమైనా దానికంటూ సొంత కరెన్సీ, పొలిటికల్​ సిస్టమ్​, కల్చరల్​ ఐడెంటిటీ ఉన్నాయి. అక్కడి ప్రజలు తమను చైనీయులుగా చెప్పుకోరు. తమపై చైనా డామినేషన్ పట్ల యూత్ గుర్రుగా ఉంది. తాము అనుభవిస్తున్న ఫ్రీడం.. చైనా వల్ల ఎక్కడ దూరమవుతుందోననేదే వాళ్ల ప్రధాన భయం.

ఈ ఏడాది ఆందోళనలు జరిగిన మరికొన్ని దేశాలు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ, ప్రతి చోటా ప్రజలు పెద్ద సంఖ్యలో హక్కుల కోసం పోరుబాట పడుతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని లెక్కచేయట్లేదు. సక్సెస్​ సాధించే దాక పట్టు విడవట్లేదు. ఈ సంవత్సరం ఇలాంటి ఉద్యమాలు జరిగిన కొన్ని దేశాలు.. హైతీ, వెనెజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, బ్రెజిల్​, బ్రిటన్​, ఫ్రాన్స్​, స్పెయిన్​, అల్జీరియా, గినియా, లైబీరియా, ఉక్రెయిన్​, సెర్బియా, మాంటెనీగ్రో, అల్బేనియా, ఈజిప్ట్, సూడాన్, జింబాబ్వే, ఇరాక్​, లెబనాన్​, రష్యా, హాంకాంగ్​, ఇండోనేసియా.