ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ లేదా ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయకుంటే మనసంతా ఏదోలా ఉంటుంది. కంప్యూటర్ లేదా ఫోన్లో గేమ్స్ ఆడేవాళ్లు, కొత్త గేమ్స్ డిజైన్ చేసేవాళ్లు అయితే తెగ బాధపడతారు. అలాంటి సమస్యే వీళ్లకు ఎదురైంది. ఇకపై ఎవ్వరికి ఈ సమస్య రాకూడదని ఒక సాఫ్ట్వేర్ తయారుచేశారు కేరళకు చెందిన అన్నదమ్ములు విష్ణు నాయర్, వాసుదేవ్ నాయర్. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు విష్ణు. వాసుదేవ్ ప్లస్ టూ స్టూడెంట్. వీళ్లు ఇద్దరూ లాక్డౌన్లో కంప్యూటర్ గేమ్స్ బాగా ఆడేవాళ్లు. కొన్నిరోజులకు వాళ్ల కంప్యూటర్ హార్డ్వేర్ అవుట్డేట్ కావడంతో దాని స్పీడ్ తగ్గిపోయింది. దాంతో ‘ఏం చేయాలి?’ అని ఆలోచించారు. కొత్త హార్డ్వేర్కి ఎక్కువ డబ్బులు కావాలి. అందుకని పాత ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని పెంచేందుకు ఒక సాఫ్ట్వేర్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఆ పనేదో మనమే ఎందుకు చేయకూడదు అనిపించింది వీళ్లకు. అలా... ‘విర్గ.టెక్’ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ తయారుచేశారు. హై– ఎండ్ ప్రాసెసర్, శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్కువ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి ఇందులో. ఈ సాఫ్ట్వేర్ ఉంటే కంప్యూటర్, ఫోన్లో గేమ్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆడొచ్చు. వీడియో ఎడిటింగ్ చేయొచ్చు.
ఎలా పనిచేస్తుందంటే...
కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా ట్యాబ్ని ‘విర్గ’ వెబ్సైట్తో కనెక్ట్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్, ఫోన్ స్పీడ్ని మాత్రమే కాకుండా వాటి స్పేస్ని కూడా పెంచుతుంది. దీంతో బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగుంటే పదేండ్ల నాటి కంప్యూటర్ కూడా గ్రాఫిక్స్ కార్డ్ ఉన్న కంప్యూటర్లా పనిచేస్తుంది. 1జిపిఎస్ వేగంతో గేమ్స్, ఇతర ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వంద మందికి ఉచితం...
యూజర్లు ‘విర్గ’ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. తర్వాత అవసరమైన సర్వీస్ని ఎంచుకోవాలి. ఆ సర్వీస్ ఎంత టైం వరకు, ఎన్ని రోజులకు కావాలో కూడా చెప్పాలి. ట్రయల్లో భాగంగా ముందుగా లాగిన్ అయిన వంద మంది ఈ సాఫ్ట్వేర్ని ఉచితంగా వాడుకోవచ్చు. త్వరలోనే ఈ సాఫ్ట్వేర్ని పూర్తిస్థాయిలో డెవలప్ చేసే పనిలో ఉన్నారు విష్ణు, వాసుదేవ్.