కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని వీఐపీ పుష్కర ఘాట్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి క్రూయిజ్ లాంచీ సేవలు పున:ప్రారంభమయ్యాయి. శనివారం తెలంగాణ టూరిజం ఈ లాంచీని ప్రారంభించగా 65 మంది ప్రయాణికులు శ్రీశైలంకు ప్రయాణించారు. పర్యాటక శాఖ అధికారులు, స్థానిక సీఐ మహేశ్, ఎస్సై హృషికేష్ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు.
హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల నుంచి ఎకో టూరిజం స్పెషల్ బస్సులో సోమశిలకు పర్యాటకులు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎత్తైన కొండల మధ్య, గలగల ప్రవహించే కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం ద్వారా శ్రీశైలం బయల్దేరారు. ఈ కార్యక్రమంలో టూరిజం యూనిట్ ఇన్చార్జి ప్రేమ్ కుమార్, డిప్యూటీ మేనేజర్ ప్రభుదాస్ పాల్గొన్నారు.
