లేహ్ ​టు ఢిల్లీ.. మహా పాదయాత్ర చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్

లేహ్ ​టు ఢిల్లీ.. మహా పాదయాత్ర చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్

లేహ్: నాలుగు పాయింట్ల అజెండా అమలుపై లడఖ్ నాయకత్వంతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్  చేస్తూ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్  నేతృత్వంలో ఆదివారం లేహ్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం వందమంది వలంటీర్లు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ‘ఢిల్లీ చలో పాదయాత్ర’ పేరుతో కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్(కేడీఏ) తో కలిసి లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) ఈ యాత్రను ప్రారంభించింది. 

రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‎ను పొడిగించడం, లడఖ్‎కు పబ్లిక్ సర్వీస్  కమిషన్‎ను ఏర్పాటు చేయడం, లేహ్– కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక లోక్ సభ సీట్లు కేటాయించాలన్న 4 డిమాండ్లతో కేడీఏ, ఎల్ఏబీ ఈ యాత్ర చేపట్టాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్రం, లడఖ్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి పురోగతి రాలేదు. దీంతో వాంగ్​చుక్ ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు. ‘భారత్ మాతా కీ జై’, ‘మాకు ఆరో షెడ్యూల్  కావాలి’  అని నినదిస్తూ వలంటీర్లు ముందుకు సాగారు. వాంగ్ చుక్ తో కలిసి ఎల్ఏబీ చైర్మన్ తుప్సన్ చెవాంగ్.. ఎన్డీఎస్  పార్క్  వద్ద ఈ యాత్రకు జెండా ఊపారు.