ద్రావిడ ఇయక్కం నాస్తికుడు తందై పెరియార్పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అన్నారు సినీనటుడు రజనీకాంత్. జనవరి 14న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ‘తుగ్లక్’ అనే పత్రికా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలకు రజనీ హాజరయ్యారు. అక్కడి ప్రసంగంలో.. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని అన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పు పడుతూ ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి ఈ నెల 17 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీకాంత్ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన రజనీకాంత్.. తాను విన్నది, పత్రికల్లో వచ్చిందే చెప్పానని అన్నారు. ర్యాలీలో హిందూ దేవతలను నగ్నంగా బయటకు తీసినట్లు ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని అన్నారు.