గత నెలలో న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనల నిమిత్తం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా సోకి చనిపోయాడు. దక్షిణాఫ్రికాకు చెందిన 80 ఏళ్ల మౌలానా యూసఫ్ టుట్లా (80) ఇటీవల విజిటింగ్ వీసాపై భారత్ కు వచ్చి… ఢిల్లీలో జరిగిన మర్కజ్ కు హాజరయ్యారు.
ప్రార్థనలు ముగిసిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లిన మౌలానాకు అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే ఆయన్ను ఐసొలేషన్ వార్డుకు తరలించిన అధికారులు, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే చనిపోయాడు. అప్పటికే మౌలానాకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.