మహబూబ్ నగర్, వెలుగు: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 106 ఫోన్లను శుక్రవారం నారాయణపేట ఎస్పీ వినీత్ అందజేశారు. నారాయణపేట ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడు నెలలుగా మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలిపారు.
చోరీకి గురైన మొబైల్స్ నేరాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత,సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని సూచించారు. జిల్లాలోని ఐటీ కోర్ పోలీసులు టెక్నాలజీ సాయంతో ట్రేస్ చేసి రూ.16 లక్షల విలువైన 106 ఫోన్లు రికవరీ చేశారని తెలిపారు. ఏఎస్పీ ఎండీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు ఎన్ లింగయ్య, మహేశ్, సీఐలు శివశంకర్, రాజేందర్ రెడ్డి, రాంలాల్, సైదులు, ఐటీ కోర్ ఎస్సై సురేశ్ పాల్గొన్నారు.
