తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో గద్దెల నిర్మాణం స్పీడ్గా సాగుతోంది. మేడారం అభివృద్ధిలో భాగంగా ఆలయం చుట్టూ ప్రహరీ విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను వెడల్పు చేయనున్నారు.
ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న గద్దెల చుట్టూ పునాదులు తీసి స్టీల్ పనులను పూర్తి చేసిన అనంతరం గద్దెల చుట్టూ 12 ఫీట్ల ఎత్తుతో గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలను ముందస్తుగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో వాటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇందులో భాగంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునఃనిర్మాణ పనులకు సంబంధించిన స్టోన్ వర్క్ను ప్రారంభించారు. త్వరలో జరగనున్న మహాజాతరకు 15 రోజుల ముందే గద్దెల నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు కొనసాగిస్తున్నారు.
