శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స థాయ్ లాండ్ లో తాత్కాలికంగా బస చేయనున్నారు. ఆయనకు ఆశ్రయమిచ్చేందుకు థాయ్ ప్రభుత్వం అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో జూలై 13న శ్రీలంక వదిలి మాల్దీవులు.. అక్కడ్నుంచి సింగపూర్ కూ వెళ్లారు. ప్రస్తుతం సింగపూర్ వీసా గడువు ముగియనుండటంతో.. ఆశ్రయం ఇవ్వాలంటూ థాయ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
మానవతా దృక్పథంతో తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే అవకాశమిస్తున్నామని.. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించవద్దని గొటబయకు థాయ్ ప్రధాని ప్రయూత్ సూచించారు. మరోవైపు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన సోదరుడు మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సలపై అంతర్జాతీయ ప్రయాణాల నిషేధాన్ని శ్రీలంక సుప్రీం కోర్టు పొడిగించింది