యాదాద్రిలో భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు

యాదాద్రిలో భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కొండపై కొలువై ఉన్న పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయం లో ఉదయం విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనం, రుత్విగ్వరణంతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ అర్చకులు వైభవంగా ప్రారంభించారు. తొలిరోజు పూజల్లో ఆలయ ఈఓ గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం అఖండ దీపారాధన, అంకురారోపణం, మండపారాధన, కలశ స్థాపన, శ్రీదేవి పూజ, మూలమంత్రజప, సప్తశతీ, లలితా పారాయణాలు నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, చరుష్ట ఉపచారయుక్త సహస్రనామార్చన, నీరాజన మంత్రపుష్పాలు, దేవీత్రికాల పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజల్లో ఆలయ డిప్యూటీ ఈఓ దోర్బల భాస్కర్  శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

నేడు త్రిశతీ దేవీ ఖడ్గమాలా నామావళి

దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం లలితా అష్టోత్తర శతనామార్చనలు, సప్తశతీ పారాయణాలు, జపాలు, త్రిశతీ దేవీ ఖడ్గమాలా నామావళి నిర్వహించనున్నారు. సాయంత్రం నవావరణ పూజ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.