అయిజ, వెలుగు: స్కూల్ టైమ్కు బస్సులు నడిపించాలని కోరుతూ శుక్రవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని కర్నూల్–- రాయచూరు అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు.
ప్రతి రోజు పాఠశాల వేళలకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నామని, వచ్చిన బస్సులు సైతం ఆపడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బస్సులు నడిపేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
