మనిషి బతకాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అవసరం. కానీ, పెరిగిపోతున్న కాలుష్యం ఈ మూడింటిని కోలుకోలేనంతగా దెబ్బతీస్తోంది. ఊపిరి పోయాల్సిన గాలి.. మనుషుల ఉసురు తీస్తోంది. ఒకానొక దశలో స్వచ్ఛమైన గాలిని రకరకాల ఫ్లేవర్లతో అమ్ముతున్న పరిస్థితి. ఈ సినారియోను మార్చేందుకు కొందరు నడుం బిగించారు. ఢిల్లీలో జరిగిన గుడ్ ఎయిర్ సమ్మిట్లో రెండు వేల మంది స్టూడెంట్స్ ‘మేకింగ్ ఇండియా బ్రీత్’ నినాదం చేశారు.
పర్యావరణం పట్ల ప్రతీ ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపు ఇచ్చారు. వాళ్ల పిలుపు అందుకున్న నెటిజన్స్ #IPledgeForGoodAir పేరిట ఒక హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. ‘‘పర్యావరణం ప్రతీ ఒక్కరి ఆస్తి. దానిని కాపాడుకుందాం. దుమ్ము, ధూళిని గాలికి దూరం చేద్దాం. విషపు గాలిని తరిమేద్దాం. స్వచ్ఛమైన ఊపిరి అందుకుందాం’’ అంటూ ట్వీట్లు చేశారు.