కాసేపట్లో ప్రియుడి పెళ్లి.. అడ్డుకున్న ప్రియురాలు

కాసేపట్లో ప్రియుడి పెళ్లి.. అడ్డుకున్న ప్రియురాలు
  • తూర్పు గోదావరి జిల్లా వలేటివారిపాలెం మాలకొండలో ఘటన

రాజమండ్రి: పెళ్లి మండపంలో ఇరువైపులా బంధు మిత్రుల హడావుడితో సందడిగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లిపీటలకెక్కేందుకు రెడీ గా ఉండగా.. అమ్మలక్కలు పెళ్లి కూతురిని వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. పంతులు రావడమే ఆలస్యం పెళ్లి తంతు మొదలుపెట్టేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇంతలో టకటక బూట్ల చప్పుళ్లు చేసుకుంటూ పోలీసులొచ్చారు. వారి వెంట ఓ యువతి కూడా ఉంది. ఆమె సూచన మేరకు పెళ్లి కుమారుడి వద్దకు వెళ్లి మాట్లాడారు. పెద్దలను పిలిపించి పెళ్లి రద్దు చేయించారు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. పోలీసుల రాకతో ఏం జరిగిందోనని దూరం నుండి చూస్తున్న వారికి పెళ్లి రద్దయిన విషయం తెలిసి షాక్ గురయ్యారు. వలేటివారి పాలెం సమీపంలోని మాలకొండ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలోని వివాహ మండపంలో శనివారం జరిగిందీ ఘటన. మరికొద్దిసేపట్లో పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో పెళ్లికొడుకు ప్రియురాలు ఎంటరై పెళ్లి ఆపేసిందన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షణాల్లో వైరల్ అయింది. 
రాజమండ్రికి చెందిన మహేష్ కు అదే పట్టణానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయం పెద్దలకు తెలియడంతో మహేష్ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.  కనిగిరికి చెందిన యువతితో మహేష్ కు పెళ్లి నిశ్చయించారు. ఈవిషయం అతని ప్రియురాలికి తెలియకుండా జాగ్రత్తపడినా.. ఆమె తెలుసుకుని పోలీసుల వద్దకు వెళ్లి న్యాయం చేయమని వేడుకుంది. మహేష్ తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని.. అతనితో తనకు పెళ్లి జరిపించమని కోరుకుంది. ఆధారాలు చూపడంతో పోలీసులు స్పందించారు. ఎస్.ఐ హజరతయ్య తన సిబ్బందిని వెంటబెట్టుకుని పెళ్లి జరుగుతున్న లక్ష్మి నరసింహస్వామి ఆలయంలోని కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మహేష్ తోపాటు.. అతని తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి రద్దు చేయించారు.