టిక్ టాక్…. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తున్న యాప్. కొందరు టైం ఎంజాయ్ కోసం చూస్తే…మరి కొందరికి అది వ్యసనంగా మారింది. దీంతో కుటుంబాల్లో గొడవలకు దారి తీయడంతో పాటు హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. టిక్ టాక్ వీడియోలు చేయవద్దన్నందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ చేసుకుంటున్న వీడియోను తీసి దాన్నికూడా టిక్ టాక్ లో అప్ లోడ్ చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనితకు పళనివేలుతో వివాహమైంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. పళనివేలు సింగపూర్లో ఉద్యోగం చేస్తుండగా.. అనిత పిల్లలతో కలిసి పెరంబళూరులో ఉంటోంది. కొన్నాళ్ల క్రితం టిక్ టాక్ గురించి తెలియడంతో అనిత టైం పాస్ కోసం వీడియోలు మొదలుపెట్టింది. అయితే రోజులు గడిచేకొద్దీ అది కాస్తా వ్యసనంగా మారింది. అనిత డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ రకరకాల మేకప్లు వేసుకుంటూ ఇలా రకరకాల వీడియోలు టిక్ టాక్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. టిక్టాక్ మాయలో పడి పిల్లలను పట్టించుకోవడం కూడా మర్చిపోయింది. కొన్ని రోజుల క్రితం అనిత కూతురు కిందపడటంతో గాయాలయ్యాయి. అయినా ఆ విషయం పట్టించుకోకుండా… ఆమె చిన్నారిని ఆస్పత్రికి కూడా తీస్కెళ్లలేదు. బంధువులు ఈ విషయాన్ని అనిత భర్త పళనివేలుకి ఫోన్ చేసి చెప్పారు.
అనిత వ్యవహారం శ్రుతిమించడంతో పళనివేలు ఫోన్ చేసి భార్యను గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనిత ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. దాన్ని కూడా వీడియో తీసి టిక్ టాక్లో పోస్ట్ చేసింది. విషయం తెలిసి స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది.